ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ మాత్రం పక్కదోవ పట్టకుండా… అర్హులైన వారికే ఇళ్లను కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల గుర్తింపునకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని క్షేత్రస్థాయిలోని అధికారులకు ఆదేశాలను ఇచ్చింది.
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 30 లోపు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతి దశలో లబ్ధిదారులకు సహకారం అందించాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడత లబ్ధిదారుల ఎంపికను అధికారులు పారదర్శకంగా పూర్తి చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. పేదవాడు సొంత ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను ఉచితంగా సబ్సిడీ కింద అందిస్తుందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మొదటి విడత లో 3 వేల 500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఉద్ఘాటించారు. ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతి పర్యవేక్షించేందుకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.
గ్రామాలు, మున్సిపల్ వార్డులో ఉన్న ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల జాబితా ఎంపిక చేయాలని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ కమిటీ ఆమోదించిన ప్రతి 200 ఇండ్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి…. ఏప్రిల్ 30 లోపు మరో సారి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని వివరించారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన పైలెట్ గ్రామంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణనికి ప్రభుత్వం లక్ష రూపాయలను విడుదల చేశామని మంత్రి తెలిపారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రజలకు భారం కాకుండా 25 శాతం రాయితీని అందించామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఏప్రిల్ నెలాఖరు వరకు గడువు పొడిగించినట్లు గుర్తు చేశారు. ఆమోదం పొందిన దరఖాస్తుల ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
సంబంధిత కథనం