దుబాయ్లో దారుణం, ఇద్దరు తెలంగాణ వాసులను హత్య చేసిన పాకిస్థానీ- కిషన్ రెడ్డి లేఖతో రంగంలోకి విదేశాంగశాఖ
దుబాయ్ లో తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ పాకిస్థానీ యువకుడు అతిదారుణంగా నరికి చంపాడు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించి విదేశాంగ మంత్రికి లేఖ రాశారు.
దుబాయ్లో ఇద్దరు తెలంగాణ వ్యక్తులను ఓ పాకిస్థానీ యువకుడు కత్తితో పొడిచి చంపిన విషయం కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లా సోన్ కు చెందిన ప్రేమ్ సాగర్(40), నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ దుబాయ్ లోని ఓ బేకరీలో పనిచేస్తు్న్నారు. అదే బేకరీలో పనిచేస్తున్న ఓ పాకిస్థానీ యువకుడు మతవిద్వేషంతో వీరిద్దరిని దారుణంగా నరికి చంపాడు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగు వారు గాయపడిట్లు తెలుస్తోంది. గత శుక్రవారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
దుబాయ్ లో తెలంగాణ వ్యక్తులపై జరిగిన దాడి ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు. ఈ విషయంపై కిషన్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు లేఖ రాశారు.
"పొట్టకూటి కోసం దుబాయ్ వలస వెళ్లిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు హత్యకు గురయ్యారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తి ఈ దురాగతానికి పాల్పడ్డాడని పలు పత్రికలు, మీడియా ద్వారా తెలిసింది. వీరిద్దరూ దుబాయ్లోని ఓ బేకరీలో పనిచేస్తున్నారని తెలిసింది. దుండగుడి చేతిలో మరో ఇద్దరు తెలుగు వాళ్లు గాయపడ్డారని తెలుస్తోంది. హంతకుడు కూడా అదే బేకరీలో పనిచేస్తూ మత విద్వేషం కారణంగా ఈ దుశ్యర్యకు పాల్పడ్డాడని, కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన తర్వాత మతపరమైన నినాదాలు చేసినట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయంలో మీరు చొరవతీసుకుని మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడంలో సహకరించగలరు" అని కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
స్పందించిన విదేశాంగ మంత్రి
ఈ లేఖపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వెంటనే స్పందించారు. వారి ఆదేశాలకు అనుగుణంగా.. దుబాయ్ లోని భారత కాన్సులేట్ అధికారులు.. ‘బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్’ను సందర్శించి కేసు వివరాలను తెలుసుకున్నారు. ఏప్రిల్ 11, 2025 నాడు ఈ ఘటనకు సంబంధించి.. ఉద్దేశపూర్వక హత్యకేసుగా రిజిస్టర్ చేశామని ఇన్వెస్టిగేటింగ్ పోలీసులు భారత ప్రభుత్వ అధికారులకు తెలియజేశారు. మోడ్రన్ బేకరీలో పనిచేస్తున్న ఓ పాకిస్థానీ వ్యక్తి.. ఇద్దరు తెలంగాణ వ్యక్తులను అత్యంత దారుణంగా చంపడంతోపాటుగా.. మరో ఇద్దరిని గాయపరిచాడని పోలీసులు వెల్లడించారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఇంకా సిద్ధం కాలేదని, మరికొంత సమయం పడుతుందని తెలిపారు. ఆ వెంటనే మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని భారత కాన్సులేట్ అధికారులు.. అక్కడి విచారణాధికారులకు సూచించారు.
సంబంధిత కథనం