Ex IAS BP Acharya Obtuse Angle : వ్యంగ్య రేఖల్లో 'బ్యూరోక్రాట్' జీవన చిత్రం - ఘనంగా 'అబ్ట్యుస్ యాంగిల్' పుస్తకావిష్కరణ-ex ias bp acharya first cartoon collection obtuse angle launched in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ex Ias Bp Acharya Obtuse Angle : వ్యంగ్య రేఖల్లో 'బ్యూరోక్రాట్' జీవన చిత్రం - ఘనంగా 'అబ్ట్యుస్ యాంగిల్' పుస్తకావిష్కరణ

Ex IAS BP Acharya Obtuse Angle : వ్యంగ్య రేఖల్లో 'బ్యూరోక్రాట్' జీవన చిత్రం - ఘనంగా 'అబ్ట్యుస్ యాంగిల్' పుస్తకావిష్కరణ

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య రచించిన 'అబ్ట్యుస్ యాంగిల్' (Obtuse Angle) అనే కార్టూన్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. సాహిత్య మహోత్సవంలో భాగంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ సివిల్ సర్వెంట్లతో పాటు పుస్తక ప్రియులు హాజరయ్యారు.

'Obtuse Angle' కార్టూన్ల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం

మాజీ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య రచించిన “Obtuse Angle” కార్టూన్ల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ సాహిత్య మహోత్సవంలో  భాగంగా "డీకోడింగ్ గవర్నెన్స్‌ ' సెషన్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సెషన్‌ను అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ డాక్టర్ దినేశ్ శర్మ నిర్వహించారు. డాక్టర్ సత్య మహంతి ఈ చర్చలో పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమానికి అనేకమంది మాజీ సివిల్ సర్వెంట్లతో పాటు పుస్తక ప్రియులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీపీ ఆచార్య కార్టూన్లను కూడా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చాలా మంది పుస్తక ప్రియులు కార్డున్లను ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా బీపీ ఆచార్య తన పుస్తకంపై సంతకం చేసి…  విక్రయానికి అందుబాటులో ఉంచారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మహోత్సవాన్ని ప్రారంభించగా…. తొలి రోజున 20 వేలకుపైగా పుస్తక ప్రియులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సివిల్ సర్వెంట్ గానే కాదు కార్టూనిస్ట్‌గా కూడా గుర్తింపు:

బీపీ ఆచార్య కేవలం సివిల్ సర్వెంట్ గానే కాదు మంచి కార్డూనిస్ట్ గా కూడా గుర్తింపు పొందారు.  ఆయనకు గ్రామీణ కళాకారులంటే అమితమైన ప్రేమ. ప్రత్యేక ప్రతిభ కలిగిన రచయితగా… రాజకీయ కార్టూనిస్ట్‌గా కూడా ఆచార్య ప్రసిద్ధి పొందారు. ‘టెడ్‌ స్పీకర్‌’ గా కూడా గుర్తింపు పొందిన ఆచార్య…. లారీ కాలిన్స్‌, డొమినిక్‌ లాపియర్‌ వంటి ప్రసిద్ధ రచయితలతో కలిసి మౌంట్‌బాటన్‌ పేపర్స్‌ను ఎడిట్‌ చేయడంలో పని చేశారు. కొన్ని ఆంగ్ల పత్రికలకు కార్టూన్లు గీయడమే కాక ఆర్టికల్స్‌ కూడా రాస్తుంటారు.

బీపీ ఆచార్య తెలంగాణ ప్రభుత్వంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తెలంగాణలో జెనోమ్‌ వ్యాలీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, మైండ్‌స్పేస్‌, రాయలసీమలో శ్రీసిటీ, ఉత్తరాంధ్రలో బ్రాండిక్స్‌ వంటి పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు.

కార్టూనిస్టు గా ఎలా మారారు…?

ఆర్కే లక్ష్మణ్‌, మారియో మిరాండా వంటి ప్రఖ్యాత కార్టూనిస్టుల వ్యంగ్య రేఖలే తనలో ఆసక్తి పుట్టించాయని బీపీ ఆచార్య చెబుతుంటారు. చిన్ననాటి నుంచే హాస్యంతో పాటు కళలపై ఆకర్షితుడయ్యారు.  నాలుగు దశాబ్దాల విద్యార్థి దశ నుంచి రిటైర్‌మెంట్‌ వరకు తన అనుభవాలను కార్టూన్లుగా మలచి ‘Obtuse Angle’ అనే కార్టూన్‌ సంకలనం రూపొందించారు. సివిల్‌ సర్వెంట్‌గా కొనసాగిన ప్రయాణంలో ఎదురైన సవాళ్లను, కష్టాలను, సరదా క్షణాలను తన వ్యంగ్య రేఖల్లో ప్రతిబింబించారు. రాజకీయ,ఆర్ధిక ,సామాజిక అంశాల పై వేసిన 100కు పైగా కార్టూన్లు ఈ పుస్తకంలో ఉన్నాయి.

ఈ పుస్తకంలోని కార్టూన్లు కేవలం ఆయన కళాత్మక ప్రతిభ మాత్రమే కాక… రాజకీయ, పరిపాలనా వ్యవస్థ లోని లోపాలను  ఎత్తి చూపాయి.  కార్టూనిస్టుగా ఆయన లోతైన అవగాహనకు సాక్ష్యంగా నిలిచాయి.