ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలు నిర్లక్ష్యం చేసి.. హైడ్రా పేరుతో పక్కా ఇళ్లను కూలగొట్టే పనిలో ఉన్నారని.. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. 1965లో అల్వాల్లో ఏర్పడిన కాలనీనిలో ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తూ.. గుడులకు కూడా నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు అక్కడ జనావాసాలకు ఆస్కారం లేదని.. అప్పుడు ఇల్లు కట్టుకున్నారని వివరించారు. ఒక తరం త్యాగం చేస్తే.. రెండో తరం ఇల్లు కట్టుకుంది.. మూడో తరం చదువుకుంటోందని ఈటెల వ్యాఖ్యానించారు.
'ప్రజల జీవనంలో మంచి మార్పు వస్తదని ముఖ్యమంత్రిని చేస్తే.. మేం ఎవరు చెప్పినా వినను.. నాకు నేను నిర్ణయం తీసుకుంటానంటున్నడు. హైడ్రా పేరుతో పక్కా ఇల్లు కూలగొట్టుడే.. అడ్డమొచ్చినవాళ్లను బుల్డోజర్లతో తొక్కవలసిందే అన్నట్లుగా స్టేట్మెంట్ ఇస్తున్నడు. ఇంటెలిజన్స్ వ్యవస్థను అడిగినా ఇక్కడి ప్రజల పరిస్థితి చెప్తారు. అయినా ఎందుకు వినడం లేదు. ఎవరు చెప్పినా విననివారిని నాయకుడు అనరు.. సైకో అంటరు. ఆయనకు ఆయనే చెప్పుకుంటున్నరు.. క్రాక్ అని. ఇలానే నల్లచెరువులో హైడ్రాతో ఇల్లు కూలగొట్టినప్పుడు.. బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది' అని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.
'ప్రజలు కంటిమీద కునుకు లేకుండా బాధపడ్తుంటే.. ఆత్మహత్య చేసుకుంటుంటే.. నవ్వేవాళ్లను సైకో అంటరు. కోర్టుల్లో అడ్వకేట్లు వాదిస్తరు. అంతిమ న్యాయ నిర్ణేత జడ్జి. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కర్తవ్యం ఆ పార్టీకి ఉంటది. ఆయా పార్టీల ఎజెండా ఆయా పార్టీలకు ఉంటది. కానీ అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలే ఉంటరు. నేను ఆనాడు ఏ పైఅధికారితో మాట్లాడినా కూడా.. కూలగొట్టడం లేదని, ఆక్రమించుకోవడం లేదని చెప్పారు. చివరకు కిరాయికి ఉండే వాళ్లతో దొంగ స్టేట్ మెంట్లు ఇప్పించారు' అని ఈటెల మండిపడ్డారు.
'గత 5-10 ఏళ్ల కిందట నిర్మించిన ఇండ్లను, కట్టడాలను కూలగొట్టమని హైడ్రా ప్రకటించింది. మళ్లీ బాచుపల్లి, ప్రగతి నగర్లో 5-7 అంతస్థుల భవనాలను కూలగొడతామని నోటీసులిచ్చారు. అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ఆర్తనాదాలు పెట్టారు. మచ్చబొల్లారంలో 133 డివిజన్లో ఒక హిందూ శ్మశానవాటికతో పాటు.. ముస్లిం శ్మశానవాటికలు ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ భూమిలో వెలిసినవి కాదు. ఈ శ్మశాన వాటిక కోసం సామల వెంకట్ రెడ్డి అనే భూదాత 20 ఎకరాల భూమి కొని.. 5 ఎకరాల భూమి ముస్లిం శ్మశానవాటికకు, 15 ఎకరాల భూమిని హిందూ శ్మశానవాటికకకు ఇచ్చారు. మచ్చబొల్లారం చుట్టూ 55 కాలనీలు ఉంటాయి. అక్కడ భూముల్లో కూడా కూల్చివేతలు చేశారు' అని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి. నేను ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టిన మాజీ ఆర్థిక మంత్రిని. సంవత్సరానికి రూ.5 వేలు కూడా అదనంగా ఖర్చుపెట్టే ఆస్కారం లేదని రేవంత్ రెడ్డికి చెప్పిన. 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 పనులకు అనేక రకాలుగా అబద్ధాలు చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. 15 నెలల పాలనలోనే ప్రజలకు ఈ విషయం అర్థమైంది' అని ఈటెల వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం