TS Politics: బీజేపీ 'ఆపరేషన్ ఆకర్ష్'... ఆ ఇద్దరితో చర్చలు పూర్తి.. నిర్ణయంపై ఉత్కంఠ!
BJP leaders meeting with ponguleti: పొంగులేటి, జూపల్లి కృష్ణారావుతో తెలంగాణ బీజేపీ నేతల చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల రాజేందర్… ఇద్దరు నేతలు పార్టీలోకి ఆహ్వానించామని చెప్పారు.
BJP leaders meeting with ponguleti srinivasa reddy:తెలంగాణ బీజేపీ.. చేరికలపై దృష్టి పెట్టింది. ఇదే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి రప్పించాలని చూస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు పలువురు నేతలు... ఇవాళ ఖమ్మం వెళ్లారు. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చలు జరిపారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దాదాపు ఐదు గంటల పాటు చర్చలు జరిగాయి.
ట్రెండింగ్ వార్తలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ... ఇద్దరి నేతలను బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ను ఢీకొట్టే పార్టీ బీజేపీనే అని చెప్పామని పేర్కొన్నారు. ఇద్దరి నేతల లక్ష్యం కూడా కేసీఆర్ ను ఓడించడమే అని... మా విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ఇద్దరు నేతలతో భేటీ అయినట్లు ఈటల స్పష్టం చేశారు. తమ విజ్ఞప్తిపై త్వరలోనే ఇద్దరు నేతలు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, కలిసికట్టుగా పనిచేసి కేసీఆర్ను గద్దె దించుతామని అన్నారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ...తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. కేసీఆర్ ను గద్దె దించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజానీకానికి అండగా ఉండేందుకే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ తుంగలో తొక్కారని ఆరోపించారు. బీజేపీ నేతలతో పలు విషయాలపై చర్చించామని చెప్పారు. మాజీ మంత్రి జూపల్లి మాట్లాడుతూ.... బీజేపీ ముఖ్య నేతలకు చెప్పాల్సింది చెప్పామన్నారు. అయితే ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. చాలా వర్గాలతో మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. అమరవీరుల ఆత్మలు శాంతించాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి తీరాలని వ్యాఖ్యానించారు. లక్ష్య సాధనం కోసం అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉందని... త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
పొంగులేటి, జూపల్లితో జరిపిన చర్చల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి,ఏనుగు రవీందర్రెడ్డి, ఏలేటి మహేశ్వర్రెడ్డితో పాటు ఇతర నేతల పాల్గొన్నారు. మరోవైపు వీరిద్దరితో భేటీ అంశంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు జరిపే విషయం తనకు తెలియదన్నారు. అయితే ఇద్దరు నేతలు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామంటూ చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం