ED Raids In Hyderabad : హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు
Enforcement Directorate Raids: హైదరాబాద్ లోని పలు ఫార్మా కంపెనీలో ఈడీ సోదాలు చేపట్టింది. ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
Enforcement Directorate Raids in Hyd: హైదరాబాద్ లో మరోసారి ఈడీ తనిఖీలు చేపట్టింది. నగరంలోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో సోదాలు చేస్తోంది. శనివారం ఉదయం 6 గంటల నుంచే తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, సహా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ట్రెండింగ్ వార్తలు
గత కొంత కాలంగా హైదరాబాద్ కేంద్రంగా ఈడీ విస్తృతంగా సోదాలు చేస్తోంది. రాజకీయ నేతలకు చెందిన కంపెనీల్లో సోదాలు చేపట్టడమే కాదు... విచారణ కూడా చేసింది. కొద్దిరోజుల క్రితమే నగరంలోని దాదాపు 10 చోట్ల సోదాలు నిర్వహించారు. వివిధ కన్సల్టెన్సీ సంస్థల్లో తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో భాగంగా హైదరాబాద్లో నిర్వహిస్తున్న నకిలీ కన్సల్టెన్సీ సంస్థలను ఈడీ గుర్తించింది. గచ్చిబౌలిలోని ఎఎస్ బీఐకి చెందిన సైడ్ అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించింది. వీటన్నింటి విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే ఈ దాడులు చేస్తున్నట్లు సమాచారం.
ఫీనిక్స్ టెక్ జోన్ కంపెనీలోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 15 బృందాలుగా విడిపోయి అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగదు లావాదేవీలకు సంబంధించి కీలక విషయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
గత ఆగస్టు నెలలో ఫినిక్స్ కంపెనీలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు. ఛైర్మన్ చుక్కపల్లి సురేశ్, డైరెక్టర్ గోపికృష్ణన్, శ్రీకాంత్, భువనేశ్ ఇళ్లలో తనిఖీలు చేసి... పలు రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ కంపెనీకి సంబంధించి... గచ్చిబౌలి, జూబ్లీహిల్,ఫిల్మ్ నగర్, శంషాబాద్ లో వెంచర్లు ఉన్నాయి. ఐటీ శాఖ సోదాల్లో లభ్యమైన కీలక సమాచారంతోనే ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.