ED questions Kavitha: 9 గంటలపాటు విచారణ.. 16న మరోసారి ED ముందుకు కవిత-ed questions kavitha for 9 hours in excise policy case summoned again on march 16
Telugu News  /  Telangana  /  Ed Questions Kavitha For 9 Hours In Excise Policy Case Summoned Again On March 16
ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత

ED questions Kavitha: 9 గంటలపాటు విచారణ.. 16న మరోసారి ED ముందుకు కవిత

12 March 2023, 5:45 ISTHT Telugu Desk
12 March 2023, 5:45 IST

delhi liquor case updates: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను సుధీర్ఘంగా విచారించింది ఈడీ. దాదాపు 9 గంటలపాటు ప్రశ్నించింది. మార్చి 16వ తేదీన మరోసారి రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.

ED questions Kavitha for 9 hours in excise policy case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఈడీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేసింది. తాజాగా నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవితను శనివారం సుదీర్ఘంగా విచారించింది ఈడీ. దాదాపు 9 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. 5 సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారించింది.

16న మరోసారి విచారణ...

అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా.. ఈడీ అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ముందుగా కవిత వ్యక్తిగత సమాచారం అడిగిన ఈడీ... అనంతరం మద్యం పాలసీ, సౌత్ గ్రూప్ ప్రమేయం, ఇండో స్పిరిట్స్ లో వాటాలకు సంబంధించి ఆరా తీసినట్లు సమాచారం. ఫోన్లు మార్చడం, ధ్వంసం చేయడం తదితర ఆరోపణలపైనా ఈడీ అధికారులు లోతుగా విచారించినట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా లంచ్, టీ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు... విరామం తర్వాత ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. హవాలా నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద కవిత వాంగ్మూలాన్ని దర్యాప్తు అధికారులు నమోదు చేశారు. ఈ కేసులో మరోసారి కవితను విచారించనున్న ఈడీ అధికారులు... మార్చి 16న మళ్లీ విచారణకు రావాలని పేర్కొంటూ నోటీసులు ఇచ్చారు.

అరుణ్‌ పిళ్‌లై, శ్రీనివాసరావు, బుచ్చిబాబు, విజయ్‌నాయర్‌ చెప్పిన విషయాలపై కవిత నుంచి వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో అంశంపై లోతుగానే ఆరా తీశారని సమాచారం. లిక్కర్ కేసు రూపకల్పనలో పాత్ర, ఆప్ నేతలతో మంతనాలు, ఈ స్కామ్ లో సౌత్‌ గ్రూపున్ లీడ్ చేస్తున్నట్లు పేర్కొంటున్న అరుణ్‌ పిళ్లై కవితకు బినామీయేనా అనే కోణంలోనూ దర్యాప్తు సంస్థ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక రెండు ఫోన్లు మార్చడాన్ని కూడా ఈడీ ప్రస్తావించిందని తెలిసింది. ఆ ఫోన్లను ధ్వంసం చేశారా? ఎవరికైనా ఇచ్చారా? అన్న కోణంలో కూడా పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఇక కవిత ఫోన్ ను ఈడీ తీసుకొని క్లోనింగ్ చేసుకొని తిరిగి ఇచ్చినట్లు సమాచారం.

ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన అరుణ్‌ పిళ్లైతో కలిపి కవితను విచారిస్తారని శనివారం వార్తలు వచ్చాయి. అయితే అలా కాకుండా కేవలం కవితను మాత్రమే ఈడీ విచారించినట్లు తెలిసింది.అయితే ఇప్పటికే కస్టడీలో ఉన్న మనీష్‌ సిసోడియాను కలిపి ఈ నెల 16న కవితను విచారించిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వాంగ్మూలం వెనక్కి తీసుకుంటున్నట్లు అరుణఅ పిళ్లై దాఖలు చేసిన కేసులో ఈడీకి నోటీసులు జారీ చేసింది రౌజ్‌ అవెన్యూ కోర్టు. ఈ నెల 13లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

విచారణ పూర్తి అయిన తర్వాత బయటకి వచ్చిన కవితకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికారు. రాత్రి ఇంటికి వచ్చాక.. పార్టీ మహిళా కార్యకర్తలు ఆమెకు దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతించారు. తర్వాత మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులతో కలిసి కవిత హైదరాబాద్‌కు బయల్దేరారు.

సంబంధిత కథనం