Telugu News  /  Telangana  /  Ed Again Issued Notices To Mlc Kavitha To Attend 20 March 2023
ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత (twitter)

ED summons to Kavitha: మరోసారి కవితకు ED నోటీసులు.. మార్చి 20న ఏం జరగబోతుంది..?

16 March 2023, 15:04 ISTHT Telugu Desk
16 March 2023, 15:04 IST

Delhi liquor scam Updates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

ED summons to BRS MLC Kavitha: ED summons to Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఈడీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేసింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో… శనివారం ఉదయం ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. ఇక మార్చి 16వ తేదీన కూడా హాజరుకావాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ్టి విచారణకు కవిత దూరంగా ఉన్నారు. పలు కారణాల రీత్యా రాలేనంటూ... ఈడీకి సమాచారం ఇచ్చారు. తన న్యాయవాది ద్వారా సమాచారం పంపించారు. ఈడీ విచారణపై స్టే ఇవ్వాలని తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని కవిత పేర్కొన్నారు. ఈమేరకు దర్యాప్తు సంస్థకు ఆకు పేజీలతో కూడిన లేఖను రాశారు.

ట్రెండింగ్ వార్తలు

మరోసారి నోటీసులు...

ఓవైపు ఇవాళ్టి విచారణకు కవిత హాజరుకాకపోవటంతో... ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. మార్చి 20వ తేదీన విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అయితే ఈడీ దర్యాప్తు అంశంపై ఇప్పటికే కవిత సుప్రీంను ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై మార్చి 24వ తేదీన కోర్టు విచారణ జరపనుంది. ఈ క్రమంలో మార్చి 20వ తేదీన ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 20వ తేదీన కవిత విచారణకు హాజరవుతారా..? ఈడీ ఏం చేయబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.

ఆ విషయాన్ని ఈడీకి చెప్పాం - కవిత తరపు న్యాయవాది

బిఆర్‌ఎస్‌ పార్టీని ఇబ్బంది పెట్టడానికే ఈడీ దర్యాప్తు పేరుతో వేధిస్తోందని కవిత తరపు న్యాయవాది ఆరోపించారు. కవిత తరపున పలు ఈడీ కోరిన పలు డాక్యుమెంట్లను సమర్పించినట్లు సోమా భరత్ చెప్పారు. కవితను ఇబ్బంది పెట్టడానికే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మనీలాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50లో నిబంధనలకు విరుద్ధంగా విచారణ చేయడాన్ని ప్రశ్నించినట్లు అడ్వకేట్ తెలిపారు. ఈడీ కేసుల్లో నిందితులుగా, సాక్ష్యులుగా విచారించడానికి ఉన్న వారి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించి ప్రస్తుతం విచారణ జరిపారన్నారు. గతంలో పలు కేసుల్లో సుప్రీం కోర్టు ఆదేశాలు, చట్టాలను ధిక్కరించి ఈడీ అధికారులు వ్యవహరించారని, 15ఏళ‌్లలోపు పిల్లలు ఉన్న మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఈడీ ఇచ్చిన నోటీసులపై చట్ట ప్రకారం ఇంటి వద్దే విచారణ జరపాలని కోరినా, ఆమెకు గడువు ఇవ్వలేదన్నారు. 11వ తేదీన చట్టానికి సహకరించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో చట్ట ప్రకారం విచారణకు హాజరయ్యారని చెప్పారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్‌ ఫైల్ చేశామని, 24న ఆ కేసు విచారణకు రానుండటంతో ఈడీకి వినతి పత్రం ఇచ్చినట్లు చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ గత వారం అడిగిన 12సెట్ల పత్రాలను అధికారులకు సమర్పించినట్లు సోమాభరత్ చెప్పారు.ఈడీ నమోదు చేసిన అక్రమ కేసును చట్టబద్దంగా ఎదుర్కొంటామని చెప్పారు.

ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు కాకపోవడానికి అనారోగ్యం కారణం కాదని సోమా భరత్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారణ జరగడం లేదని, చట్టబద్దంగా తమకు ఉన్న హక్కులని అమలుచేయాలని తాము కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఈడీకి తెలియచేసినట్లు చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం వ్యవహరించాలని కోరినట్లు విజ్ఞప్తి చేశామన్నారు. చట్ట ప్రకారం ఇంటి దగ్గరే విచారించాలని ఈడీ అధికారులను కోరినట్లు తెలిపారు. కవిత సెల్‌పోన్‌ను కూడా అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని కవిత లేఖలో పేర్కొన్నారు.

అయితే మార్చి 16వ తేదీనే కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందన్న వార్తలు జోరుగా వినిపించాయి. కానీ 9 గంటల పాటు విచారించిన దర్యాప్తు సంస్థ... అరెస్ట్ చేయలేదు. 16వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. అయితే ఇవాళ్టి విచారణ నేపథ్యంలో... కవితను అరెస్ట్ చేస్తారా..? లేక కేవలం విచారణ వరకే పరిమితం చేస్తారా..? అన్న చర్చ జరిగింది. అయితే కవిత విచారణకు రాలేనని చెప్పారు. కోర్టులో వేసిన పిటిషన్ విషయాన్ని ఈడీ దృష్టికి తీసుకెళ్లారు. మార్చి 24వ తేదీన సుప్రీంకోర్టు తన పిటిషన్ పై విచారణ జరుపుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉన్నప్పటికీ.. ఈడీ మాత్రం మార్చి 20వ తేదీన కవిత విచారణకు రావాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో అదే రోజు పిళ్లైతో పాటు కవితను కలిపి విచారించాలని ఈడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 20వ తేదీన విచారణకు హాజరుకాకపోతే కవితను అరెస్ట్ చేస్తుందా..? లేక కోర్టు విచారణ నేపథ్యంలో అప్పటివరకు ఆగుతుందా..? అనేది హాట్ టాపిక్ గా మారింది.