Delimitation : డీలిమిటేషన్ పై డీఎంకే పోరు...! తెలంగాణ సీఎం రేవంత్ కు ఆహ్వానం
డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై డీఎంకే పోరాటానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 22న చెన్నైలో జేఏసీ సమావేశాన్ని తలపెట్టింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. ఈ మేరకు డీఎంకే నేతల బృందం హైదరాబాద్ పర్యటనకు వచ్చింది.

నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) విషయంలో కేంద్రం వైఖరిపై డీఎంకే పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే కార్యాచరణను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా మార్చి 22వ తేదీన చెన్నైలో కీలక సమావేశాన్ని తలపెట్టింది. ఇందుకు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో పాటు పలువురు నేతలను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా…డీఎంకే నేతల బృందం హైదరాబాద్ చేరుకుంది.
ఇవాళ డీఎంకే నేతల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. డిలిమిటేషన్ తో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి హాజరుకావాలని కోరింది. తమిళనాడు రాష్ట్ర మంత్రి టీకే నెహ్రూ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రతినిధుల బృందం ఆహ్వానాన్ని అందించింది.
సమావేశానికి హాజరవుతాను - సీఎం రేవంత్
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… సరైన విధానాలు లేకుండా లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని పునరుద్ఘటించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా తలపెట్టిన డీలిమిటేషన్ ఎత్తుగడకు వ్యతిరేకంగా అవసరమైతే జాతీయ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తామన్నారు.
“పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది సహా ఇతర రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై చర్చించడంతో పాటు కేంద్రం కుట్రలను నిలువరించేలా తదుపరి కార్యాచరణ తీసుకోడానికి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ గారిని అభినందిస్తున్నాను. మా పార్టీ హైకమాండ్ అనుమతి తీసుకొని ఈనెల 22న చెన్నై వేదికగా జరగబోయే సమావేశానికి హాజరువుతాను” అని సీఎం రేవంత్ చెప్పారు.
“దేశ ప్రగతిలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఎంతో ఉంది. కేవలం తమకు రాజకీయంగా పట్టు చిక్కడంలేదనే అక్కసుతో బీజేపీ డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలను లిమిట్ చేయాలని భావిస్తోంది. ఈ కుట్రలను కచ్చితంగా తిప్పికొట్టి… దేశ సమైక్యతను, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకుంటాం. అందుకోసం అవసరమైతే జాతీయ స్థాయిలో ఆందోళన చేపడతాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోనూ డీలిమిటేషన్ అంశంపై ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి జానారెడ్డి సారధ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలతో పాటు పౌర సమాజం ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకొని కేంద్రానికి నివేదిస్తామన్నారు. ప్రతిఒక్కరు రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం ఇదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ కు ఆహ్వానం..!
చెన్నై వేదికగా నిర్వహించబోయే సమావేశానికి బీఆర్ఎస్ ను కూడా డీఎంకే ఆహ్వానించనుంది. ఇందులో భాగంగా నేతల బృందం… తెలంగాణ భవన్ కు వెళ్లనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ కానుంది. కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నాయకులతో సమావేశమవనుంది.
సంబంధిత కథనం