DK Aruna on KTR : కేటీఆర్ పై డీకే అరుణ ఫైర్ - దొంగ సవాల్ అంటూ ఎద్దేవా !
DK Aruna on KTR : మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ని ఉద్దేశించి కేటీఆర్ చేసిన ఛాలెంజ్ ని.. దొంగ సవాలుగా అభివర్ణించారు.
DK Aruna on KTR : డ్రగ్ టెస్టు విమర్శలు... బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి, సవాళ్ల సమరానికి తెరలేపింది. డ్రగ్ టెస్టుకి తాను సిద్ధమని.. పరీక్షలో తాను క్లీన్ గా బయటకి వస్తే .. తనపై ఆరోపణలు చేస్తున్న వారు చెప్పు దెబ్బలకు సిద్ధమా అని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ని ఉద్దేశించే కేటీఆర్ ఈ సవాల్ విసరగా... బీజేపీ సైతం అంతే దీటుగా స్పందించింది. "డీ అడిక్షన్ చికిత్స తీసుకుని.. శరీరంలో డ్రగ్ ఆనవాళ్లు ఏమీ లేవని నిర్ధారించుకున్నాకే.. దొంగ సవాల్ విసురుతున్నావా కేటీఆర్ ?" అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. కేటీఆర్ సవాల్.. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బండి సంజయ్ పై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ డీకే అరుణ ప్రకటన విడుదల చేశారు.
ట్రెండింగ్ వార్తలు
"బండి సంజయ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. దొంగలు పడ్డ ఆరు నెలలకు, కుక్కలు మొరిగినట్టుంది కేటీఆర్ సవాల్. మా అధ్యక్షుడు రెండేళ్ల క్రితం సవాల్ చేసినప్పుడు.. నీ గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ ఎందుకు ఇవ్వలేదు కేటీఆర్ ? అప్పుడు డ్రగ్స్ తీసుకున్నందుకే ఇవ్వలేదా ? ఏ డ్రగ్ తీసుకున్నా.. దాని ఆనవాళ్లు శరీరంలో కొన్ని గంటల నుంచి కొద్ది నెలల పాటు ఉంటాయి. కొన్ని డ్రగ్స్ ఆనవాళ్లు 24 గంటలు ఉంటే.. మరికొన్ని ఆరు నెలల నుంచి 9 నెలలు శరీరంలో ఉంటాయి. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు... రెండేళ్ల క్రితం బండి సంజయ్ చేసిన సవాల్ కు స్పందించకుండా.. ఇప్పుడు నువ్వు ప్రతి సవాల్ విసిరితే ఏం లాభం కేటీఆర్ ?నువ్వు డ్రగ్స్ తీసుకున్న తర్వాత.. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విసిరిన సవాల్ కు సమాధానం చెప్పలేక, విదేశాలకు వెళ్లి, డీ అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుని వచ్చి.. శరీరంలో డ్రగ్ ఆనవాళ్లు ఏమి లేవని నిర్ధారించుకున్నాకే... దొంగ సవాల్ విసురుతున్నావా కేటీఆర్ ?" అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు డీకే అరుణ.
కేటీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే.. నిజంగా డ్రగ్స్ తీసుకోకపోతే.. బండి సంజయ్ సవాల్ చేసినప్పుడే ఎందుకు స్పందించలేదని డీకే అరుణ ప్రశ్నించారు. అప్పుడే గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ, లివర్ సహా ఇతర భాగాలు ఇవ్వకుండా.. ఇన్ని రోజులు ఎందుకు ఆగావు కేటీఆర్ అని నిలదీశారు. గౌరవ పార్లమెంటు సభ్యుడు, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన బండి సంజయ్ పై ఇలాంటి వ్యాఖ్యలు దేనికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కొడుకై ఉండి, భవిష్యత్ సీఎం అని ప్రచారం చేసుకుంటున్న వ్యక్తే.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే... ఎవరిని ఎవరు చెప్పుతో కొట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని డీకే అరుణ అన్నారు. కేటీఆర్ ఉడత ఊపులకు... పిట్ట బెదిరింపులకు, పిల్ల చేష్టలకు భయపడేవారు ఎవరూ లేరని... కేసీఆర్ కుటుంబం పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.