Telangana Budget 2025 : రూ.3,04,965 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్-deputy chief minister mallu bhatti vikramarka presented the state budget for financial year 2025 26 in the assembly ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Budget 2025 : రూ.3,04,965 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్

Telangana Budget 2025 : రూ.3,04,965 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్

Telangana Budget 2025 Updates : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,04,965 కోట్లతో పద్దును ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఆర్థిక పద్దు పత్రాలు అందజేత

తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే… బడ్జెట్ ప్రసంగాన్ని చదవి వినిపించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ… రూ. రూ. 3,04,965 కోట్లతో కూడిన పద్దును ప్రవేశపెడుతున్నట్లు భట్టి తెలిపారు.రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు.

తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751గా ఉందని ఆర్థిక మంత్రి భట్టి తెలిపారు. వృద్ధిరేటు 9.6 శాతంగా ఉందని పేర్కొన్నారు. దేశ తలసరి ఆదాయం రూ.2,05,579గా ఉంటే… దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1.8 రెట్లు ఎక్కువని బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు.

  • మొత్తం బడ్జెట్ వ్యయం - రూ. 3,04,965 కోట్లు
  • రెవెన్యూ వ్యయం - రూ. 2,26,982 కోట్లు
  • మూలధన వ్యయం - రూ. 36,504 కోట్లు

ఈ ఆర్థిక పద్దులో ఎస్టీ సంక్షేమ శాఖకు రూ.17,169 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.3,591 కోట్లు,బీసీ సంక్షేమ శాఖకు రూ.11,405 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఐటీ శాఖకు రూ.7,704 కోట్లు పౌర సరఫరాల శాఖకు రూ.5,734 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.3,527 కోట్లు, రోడ్లు, భవనాల శాఖకు రూ.5,907 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు రూ.17, 677 కోట్లు కేటాయిస్తున్నామని వివరించారు.

మహాలక్ష్మీ బస్సులో ఉచిత ప్రయాణానికి రూ.5,005 కోట్లు ఆదా అయిందని భట్టి తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.433 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని… ఇళ్లు మహిళల పేరుపై మంజూరుకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి తెలిపారు. ఈ స్కూల్స్‌లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు కల్పిస్తామన్నారు. గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచామని గుర్తు చేశారు.

ఆరోగ్య శ్రీ పరిధి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని ఆర్థికమంత్రి భట్టి వివరించారు. కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేర్చామన్నారు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ఖర్చు 20 శాతం పెంచామని తెలిపారు.

రైతులకు రూ.20, 616 కోట్లు రుణమాఫీ చేసినట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి ప్రస్తావించారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12000 ఇస్తున్నామని… ఈ స్కీమ్ కోసం రూ.18000 కోట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంచామన్నారు. తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గిందన్నారు. రాజీవ్ యువ వికాస పథకానికి రూ.6000 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.

ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2 నీటి సరఫరా ప్రాజెక్టు చివరి దశకు చేరుకుందని భట్టి తెలిపారు. దేశానికి తలమానికంగా ఉండేలా ఫ్యూచర్‌ సిటీని రూపొందిస్తున్నామని…. శ్రీశైలం- నాగార్జునసాగర్‌ రహదారుల మధ్య ఇది ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఏఐ సిటీ, ఫార్మా హబ్‌, స్పోర్ట్స్‌ సిటీ, క్లీన్‌ ఎనర్జీ, ఇన్నోవేషన్‌ జోన్లు, మల్టీ మోడల్‌ కనెక్టివిటీ విభాగాలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక అథారిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్‌ ప్లాన్‌ 2050 రూపొందించామని చెప్పుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ రిజర్వేషన్లపై కమిషన్లు ఏర్పాటు చేసి అధ్యాయనం నిర్వహించామని భట్టి గుర్తు చేశారు. ఆయా కమిషన్లు ఇచ్చిన నివేదికలను శాసనసభ వేదికగా ఆమోదించామని తెలిపారు. 

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం