Delhi Liquor Scam : 10 గంటలకుపైగా కవితపై ఈడీ ప్రశ్నల వర్షం.. మరోసారి రావాలని నోటీసులు
Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సుమారు పదిగంటలకుపైగా ఆమెను అధికారులు విచారణ చేశారు.
దిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ ఎదుట రెండోసారి ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. కవితతోపాటుగా ఈడీ కార్యాలయానికి ఆమె భర్త అనిల్, న్యాయవాది భరత్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. పదిగంటలకుపైగా ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. విచారణ తర్వాత నేరుగా కవిత బయటకు వచ్చారు. కారులో వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు మరోసారి హాజరుకావాలని కవితకు ఈడీ నోటీస్ జారీ చేసింది. మళ్లీ కవిత విచారణకు హాజరు అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఈడీ అధికారులు కవితను విచారించారు
ట్రెండింగ్ వార్తలు
ఓ వైపు కవిత విచారణ జరుగుతుండగానే.. సాయంత్రం తెలంగాణ(Telangana) అదనపు ఏజీ ఈడీ కార్యాలయానికి వచ్చారు. దిల్లీ, హైదరాబాద్(Hyderabad) సమావేశాల్లో చర్చించిన అంశాలపై ఈడీ అధికారులు ఆమెపై ప్రశ్నలు కురిపించినట్టుగా తెలుస్తోంది. సౌత్ గ్రూప్(South Group) నుంచి కవిత కీలక వ్యక్తిగా ఆరోపణలు ఉన్నాయి. బ్యాంక్ స్టేట్ మెంట్స్ సహా మిగిలిన డాక్యుమెంట్లను కవిత వారికి అందించినట్టుగా తెలుస్తోంది.
డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత నుంచి సంతకాలు ఈడీ అధికారులు సేకరించినట్టుగా సమాచారం. ఈ కేసులో ఉదయం నుంచి ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించింది. పది గంటలకుపైగా సుదీర్ఘ విచారణ తర్వాత కవిత బయటకు వచ్చారు. రాత్రి 9.10 గంటల వరకూ విచారణ కొనసాగింది. మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్ పాత్ర, వంద కోట్ల వ్యవహారం మీద కూపీ లాగినట్టుగా చర్చ నడుస్తోంది. మార్చి 11న మెుదటిసారి కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ రోజున ఎనిమిది గంటలపాటు ఈడీ విచారణ చేసింది.
ఉదయం పిళ్లైతో, సాయంత్రం నుంచి సిసోడియా, అమిత్ అరోరాతో కలిసి ఆమెను ఈడీ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. వాంగ్మూలం, కీలక డాక్యుమెంట్లపై ఆమె నుంచి సంతకాలు సేకరించినట్టుగా సమాచారం. ఓ వైపు కవిత విచారణ సందర్భంగా ఈడీ ఆఫీస్ బయట ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. విచారణ అనంతరం నేరుగా ఆమె కారు ఎక్కి వెళ్లిపోయారు. మరోవైపు.. దర్యాప్తు ఏజెన్సీల తీరు మీద కవిత సుప్రీం కోర్టు(Supreme Court) మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పెండింగ్ లోనే ఉంది.
సంబంధిత కథనం