Deepavali 2022 : శ్మశానంలో దీపావళి పండగ.. ఎక్కడో తెలుసా?
Diwali 2022 In Telangana : దీపావళి పండగ సంబరాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం.. శ్మశానంలో దీపావళి వేడుకలు నిర్వహిస్తారు. ఇంతకీ ఎక్కడ? ఎందుకలా చేస్తారు?
శ్మశాన వాటికలు చీకటితో ఉంటాయి. రాత్రైతే అక్కడకు వెళ్లాలంటే తెగ భయం. అటు వైపు నుంచి నడవాలన్నా.. అంత సాహసం ఎందుకు అనుకుంటారు. కానీ ఓ ప్రదేశంలో మాత్రం ఇందుకు భిన్నం. అక్కడ శ్మశానంలో దీపావళి(Deepavali) రోజు చీకటి తొలగిపోతుంది. ఎప్పుడూ కనిపించని వాతావరణం కనిపిస్తుంది. శ్మశానంలోనే దీపావళి పండుగ జరుగుతుంది. అదే కరీంనగర్లోని కార్ఖానగడ్డ.
ట్రెండింగ్ వార్తలు
ప్రతి సంవత్సరం దీపావళి నాడు దశాబ్దాల నాటి సంప్రదాయాన్ని ఇక్కడ పాటిస్తారు. వెలుగుల పండుగను జరుపుకోవడానికి ప్రజలు తరలి రావడంతో కార్ఖానగడ్డ శ్మశానవాటిక చీకటికి వీడ్కోలు పలుకుతుంది. రెండేళ్లుగా కోవిడ్(Covid) మహమ్మారి కారణంగా కాస్త తగ్గింది. కానీ మళ్లీ ఈ ఏడాది జరుగుతోంది. క్రాకర్లు పేల్చడం, చనిపోయిన వారికి వివిధ స్వీట్లు, వంటకాలు చేసి అక్కడ పెట్టడం చేస్తారు.
కరీంనగర్(Karimnagar)లో ఆరు దశబ్దాలకు పైగా శ్మశానంలోనే దీపావళి పండుగ జరిపే సాంప్రదాయం కొనసాగుతుంది. పూర్వీకులను స్మరిస్తూ.. కుటుంబ సభ్యులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు పెడతారు. పండగకు వారం రోజులకు ముందే శ్మశానంలో శుభ్రం చేస్తారు. సమాధులకు రంగులు వేస్తారు. తరువాత కుటుంబ సభ్యులు.. పూలతో సమాధులను అలంకరిస్తారు.
దీపావళి(Diwali 2022) పండగ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు.. సమాధుల వద్దకు చేరుకుని గడుపుతారు. కొందరు.. శాఖాహారంతో వస్తే మరికొందరు వివిధ రకాల మాంసాహార వంటకాలను తీసుకొస్తారు. చనిపోయిన వారికి ఇష్టమైన వాటిని అక్కడ పెడాతరు. ఆసక్తికరంగా కొందరు మద్యం, కల్లు, బీడీలు, సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లు కూడా పెడతారు.
కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఆచారంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్(Karimnagar Municipal Corporation) కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. శ్మశానవాటికను శుభ్రం చేయడంతో పాటు ఈ ఏడాది కార్పొరేషన్ ద్వారా లైటింగ్, తాగునీరు తదితర ఏర్పాట్లు చేశారు.
గతంతో పోల్చితే ఈ ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకుని శ్మశాన వాటికకు ఎక్కువ మంది వచ్చారని స్థానికులు చెబుతున్నారు. 2020, 2021లో కరోనా మహమ్మారి కారణంగా కొద్దిమంది మాత్రమే వేడుకల కోసం శ్మశానవాటికకు వచ్చారు.