పేరూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన జవాన్ల మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించారు. మొదట ల్యాండ్ మైన్ పేలడం వల్ల చనిపోయారని ప్రచారం జరగగా.. పోస్టుమార్టంలో మాత్రం బుల్లెట్ గాయాల వల్లే చనిపోయినట్లు వెల్లడైనట్లు తెలిసింది. దీంతో అసలు కర్రెగుట్టల్లో ఏం జరిగి ఉంటుందోననే చర్చ మొదలైంది.
మృతి చెందిన గ్రేహౌండ్స్ జవాన్ల డెడ్ బాడీలను గురువారం మధ్యాహ్నం ప్రత్యేక హెలీ క్యాప్టర్ లో వరంగల్ లోని మామునూరు ఎయిర్ పోర్టుకు తరలించగా.. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం వారివారి స్వగ్రామాలను మృతదేహాలను తరలించారు. కాగా డెడ్ బాడీల తరలింపు నుంచి పోస్టుమార్టం దాకా పోలీసులు గోప్యంగానే వ్యవహరించడం గమనార్హం.
మొదట ల్యాండ్ మైన్ పేలడం వల్ల జవాన్లు మృతి చెందారనే ప్రచారం జరగగా.. బుల్లెట్ గాయాలతోనే చనిపోయినట్లు పోస్టుమార్టంలో నిర్ధారైనట్లు తెలిసింది. దీంతో కర్రెగుట్టలో అసలు ఏం జరిగి ఉంటుందనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇదిలాఉంటే వరంగల్ జిల్లా పైడిపల్లికి చెందిన ఆర్ఎస్సై రణధీర్ గాయాల పాలవగా.. అత్యవసర వైద్యసేవల కోసం ఆయనను హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కర్రెగుట్టలో జరుగుతున్న ఎన్ కౌంటర్ల విషయంలో తెలంగాణ పోలీసులు చాలావరకు గోప్యత పాటిస్తున్నారు. గురువారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్కు చెందిన సందీప్, రంగారెడ్డి జిల్లా హయత్నగర్కు చెందిన పవన్కల్యాణ్, కామారెడ్డి జిల్లా పాల్వంచకు చెందిన శ్రీధర్ అనే కానిస్టేబుళ్లు మృతి చెందగా.. ఆ విషయం కాస్త బయటకు పొక్కింది. సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరిగింది.
వారి మృత దేహాలను వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించగా.. గురువారం మధ్యాహ్నం సమయంలో తెలంగాణ డీజీపీ డా.జితేందర్, గ్రౌహౌండ్స్ ఏడీజీ స్టీఫెన్ రవీంద్ర ఇద్దరూ ఎంజీఎం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆ మృతదేహాలను పరిశీలించిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు.
అనంతరం డెడ్ బాడీలను హనుమకొండలోని వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు తరలించగా.. అక్కడ నివాళులర్పించారు. అనంతరం వారివారి స్వగ్రామాలకు మృతదేహాలను పంపించారు. నక్సలైట్ల దాడిలోనే గ్రే హౌండ్స్ సిబ్బంది వడ్ల శ్రీధర్, ఎన్.ప వన్ కళ్యాణ్, టి.సందీప్ చనిపోయినట్లు గురువారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు.
ముగ్గురు జవాన్లు మందు పాతర పేలడం వల్లే చనిపోయారనే ప్రచారం జరిగింది. ఒకవేళ అదే జరిగి ఉంటే మందు పాతర ప్రభావానికి మృత దేహాలు చెల్లాచెదురయ్యేవి. కానీ ఇక్కడ అలా జరగకపోవడం, బుల్లెట్ గాయాలతోనే జవాన్లు మృతిచెందినట్లు పోస్టుమార్టం ద్వారా స్పష్టమైనట్లు తెలిసింది. మెడ, పక్కటెముకలు, కడుపులోకి బుల్లెట్లు వెళ్లడంతోనే వాళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
దీంతో అసలు అక్కడ ఏం జరిగి ఉంటుందోననే చర్చ మొదలైంది. ఇదిలాఉంటే సాధారణంగా మార్చురీ వద్ద మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్న సమయంలో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తుంటారు. వారి సమక్షంలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారు. కానీ మార్చురీ వద్ద జవాన్ల కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం.
అక్కడున్న గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది చనిపోయిన జవాన్ల కుటుంబ సభ్యులు, బంధువులను పోస్టుమార్టం వద్దకు కాకుండా నేరుగా వారిని పోలీసు హెడ్ క్వార్టర్స్ కు తరలించి, డెడ్ బాడీలు అప్పగించడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం