రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. హయత్ నగర్ కుంట్లూరు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎంను వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇంటి 100మీటర్ల దూరంలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో హయత్నగర్ కుంట్లూరు ఏజిస్ పెట్రోల్ బంకు సమీపంలో ఎంహెచ్2 డిజి 0771 స్కోడా కారు ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొంది. మృతి చెందిన వారిని సమీప గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో కుంట్లూరుకు చెందిన వర్షిత్, త్రినాథ్, చంద్రశేఖర్ రెడ్డిలుగా గుర్తించారు.
బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు బంధువులు వివరించారు. ప్రమాద స్థలానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే వారి ఇల్లు ఉంది. కొన్ని సెకన్లలో ఇంటికి చేరుతారనగా మృత్యువు ముంచుకు వచ్చింది. ప్రమాద సమాచారం తెలియడంతో మృతుల కుటుంబీకుల ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వర్షిత్, త్రినాథ్ ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు.