Karimnagar Crime: అత్తారింటికి దారేది... సినిమా టైటిల్ కాదు.. ప్రేమించి పెళ్ళి చేసుకున్న బిడ్డపై కోపంతో బిడ్డ అత్తారింటికి దారి లేకుండా చేశారు అమాయి పేరెంట్స్. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్ళితే శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కనకం రత్నాకర్ అదే గ్రామనికి చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన మమత ప్రేమించుమన్నారు. ఒకే గ్రామం పక్కపక్కనే ఇళ్ళు ఉండడంతో ఏడాది కాలంగా ప్రేమాయణం సాగించారు. కుటుంబ సభ్యులకు తెలిస్తే పెళ్ళి జరగనివ్వరు అనుకున్నారేమో... ఎవ్వరికీ చేప్పకుండా ఇంట్లో వారికి తెలియకుండా ప్రేమ పెళ్ళి చేసుకున్నారు.
మమత పేరెంట్స్ కు సమాచారం ఇవ్వకుండా పెళ్ళి చేసుకుందనే కోపంతో ఆమె పెళ్ళి చేసుకున్న రత్నాకర్ ఇంటికి వెళ్ళే దారికి అడ్డంగా సిమెంట్ ఇటుకలతో గోడ నిర్మించారు. అమ్మాయికి అత్తారింటికి దారి లేకుండా చేశారు.
ప్రేమ పెళ్ళి చేసుకున్నందుకు దారి లేకుండా చేయడంతో ప్రేమజంట ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నేరమా అంటూ గ్రామ పెద్దలను ఆశ్రయించారు. కన్నవారికి తెలియకుండా పెళ్ళి చేసుకుంటే దారికి అడ్ఢంగా గోడ నిర్మించడం ఏంటని ప్రశ్నించారు. గ్రామ పెద్దలు అమ్మాయి పేరెంట్స్ ను సంప్రదించి దారి మూసేయడం సరైన పద్దతి కాదని సూచించారు.
ఇంటి పక్కోడిని తెలియకుండా పెళ్ళి చేసుకున్న కూతురు మోహం చూడకూడదనే ఉద్ధేశ్యంతో దారికి అడ్డంగా గోడ నిర్మించామని వితండవాదం చేశారు. ఎవరు చేప్పినా అమ్మాయి పేరెంట్స్ వినకపోవడంతో ఇక ప్రయోజనం లేదని భావించి చివరకు పోలీసులను ఆశ్రయించారు.
ప్రేమ పెళ్ళి చేసుకున్న పాపానికి అత్తారింటికి దారి లేకుండా చేశారని నవదంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ తో సమస్యను పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రేమ పెళ్ళితో ఆదర్శంగా నిలువాలని భావించిన జంటా ఠాణా మెట్లు ఎక్కడం స్థానికంగా కలకలం సృష్టించింది. చివరకు పోలీసులు నచ్చచెప్పి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో వివాదం ప్రస్తుతానికి సద్దు మణిగింది.
(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, కరీంనగర్)