కష్టపడి తనను చదివించి.. ఉన్నత స్థానానికి ఎదిగేలా చేసిన తండ్రికి ఆ కూతురు బహుమతి ఇవ్వాలనుకుంది. నాన్న కోసం బైక్ను కొనుగోలు చేసి.. చెప్పకుండా ఇంటికి వెళ్లి తండ్రిని సర్ప్రైజ్ చేయాలనుకుంది. కానీ.. అదే బైక్పై సొంతూరుకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని చనిపోయింది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం అర్ధరాత్రి జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రుకు చెందిన చెడే జనార్దన్కు.. కుమార్తె యశస్విని (24), కుమారుడు ఉన్నారు. యశస్విని బాగా చదివి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. యశస్విని తన తండ్రికి బహుమతిగా ఇచ్చేందుకు హైదరాబాద్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను ఇటీవల కొనుగోలు చేశారు. తోటి ఉద్యోగి నాగఅచ్యుత్కుమార్ సాయంతో.. ఆ బైక్ను తీసుకొని శుక్రవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరింది.
శనివారం అర్ధరాత్రి సమయంలో మునగాల మండలం ఆకుపాముల వద్దకు వచ్చారు. అయితే.. రోడ్డుపై చనిపోయి ఉన్న గేదెను గుర్తించక దానిని ఢీకొని పడిపోయారు. అదేసమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ.. యశస్వినిని ఢీకొట్టి తలమీదుగా వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న నాగఅచ్యుత్కుమార్కు గాయాలయ్యాయి. ఆయన్ను కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయాన్ని పోలీసులు యశస్విని కుటుంబ సభ్యులకు చెప్పారు. చేతికందిన కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో.. ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తనకోసం బహుమతి తీసుకొస్తానన్న కూతురును విగతజీవిగా చూసి.. ఆ తండ్రి గుండె తల్లడిల్లిపోయింది. మృతురాలి చిన్నాన్న సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు.. పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడు.
సంబంధిత కథనం