ఇటుకలు లేకుండానే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షల్లోనే పూర్తి.. 30 ఏళ్లు పక్కా!-construction of indiramma houses using shear wall technology in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇటుకలు లేకుండానే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షల్లోనే పూర్తి.. 30 ఏళ్లు పక్కా!

ఇటుకలు లేకుండానే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షల్లోనే పూర్తి.. 30 ఏళ్లు పక్కా!

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం 15 రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తిచేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే పలుచోట్ల ఈ సాంకేతికతతో నిర్మాణం చేపట్టారు. ఇది ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షలతోనే సాధ్యం అవుతోంది.

ఇందిరమ్మ ఇండ్లు

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోంది. అయితే.. ఈ డబ్బులతో నిర్మాణం పూర్తి కాదని.. చాలామంది వెనకడుగు వేస్తున్నారు. మంజూరు అయినా నిర్మాణం ప్రారంభించలేదు. ఈ సమయంలో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కేవలం ఆరుగురు వర్కర్ల సాయంతో.. 15 రోజుల్లో.. 75 చదరపు గజాల్లో.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టారు.

షీర్ వాల్ టెక్నాలజీతో..

తెలంగాణ హౌసింగ్​ డిపార్ట్​మెంట్​ పర్యవేక్షణలో ఓ ప్రైవేట్ ​కంపెనీ ఇంటి నిర్మాణాన్ని చేసిచూపెట్టింది. షీర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇటుకలు వాడకుండా, కేవలం అల్యూమీనియం ఫ్రేమ్ వర్క్, కాంక్రీట్ గోడలతో పక్కా ఇంటిని నిర్మించింది. ఇప్పటికే నాలుగు మోడల్ హౌస్‌ల నిర్మాణాన్ని పూర్తి చేసిన కంపెనీ.. లబ్ధిదారులతో అగ్రిమెంట్‌కు సన్నాహాలు చేస్తోంది.

4 ఇండ్లు పూర్తి..

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు మోడల్ హౌస్‌ల నిర్మాణాన్ని ఆ కంపెనీ పూర్తిచేసింది. నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాలో రెండు, కామారెడ్డి జిల్లాలో ఒకటి, సంగారెడ్డి జిల్లాలో ఒక మోడల్ హౌస్‌ను ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్మించారు. కేవలం ఆరుగురు కార్మికులు రోజుకు 16 గంటలు పని చేసి ఈ ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇవీ దాదాపు 30 ఏళ్లు మన్నికగా ఉంటాయని ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

ఖర్చు, సమయం తక్కువే..

హైదరాబాద్​లోని వేదాన్ ఇన్‌ఫ్రా టెక్ కంపెనీ 2018 నుంచి అల్యూమీనియం ఫ్రేమ్ వర్క్ షీట్​లు చేసి.. నిర్మాణ సంస్థలకు సరఫరా చేస్తోంది. హైదరాబాద్​లో 30, 40 ఫ్లోర్లతో నిర్మించే హైరైజ్డ్ అపార్ట్‌మెంట్లు, విల్లాలను ఇదే షీర్​వాల్ టెక్నాలజీతో ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్​వర్క్​, కాంక్రీట్​ గోడలతో నిర్మిస్తున్నారు. ఈ టెక్నాలజీతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు తక్కువ టైమ్ లో ఇండ్లు నిర్మించి ఇస్తామని కంపెనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

ప్రభుత్వం అంగీకారం..

ఈ కంపెనీ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఏడాది మార్చిలో మండల కేంద్రాల్లో నిర్మిస్తున్న మోడల్ హౌజ్‌లలో కొన్నింటి నిర్మాణ బాధ్యతలు ఈ కంపెనీకి అప్పగించింది. కంపెనీ నాలుగు ఇండ్లను పూర్తి చేసింది. వీటిని చూసిన కొందరు లబ్ధిదారులు.. తమకు అలాంటి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కంపెనీని సంప్రదిస్తున్నారు.

తుది దశలో..

తొలి దశలో 71 వేల మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి. వాటిల్లో 65 వేల మంది అర్హులుగా తేలారు. 3 వేల మంది లబ్ధిదారులు బేస్ మెంట్ పూర్తి చేయగా.. మరో 20 వేల మంది ఇండ్ల నిర్మాణం ప్రారంభించారు. రెండో దశలో లబ్ధిదారుల ఎంపిక చివరి దశకు చేరుకుంది. త్వరలో రెండో దశ లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయనున్నారు.

సంబంధిత కథనం