Conspiracy to Murder: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హత్యకు కుట్ర..!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై మరోసారి హత్యకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ పరిధిలోని ఓ ఇంట్లో జిలీటెన్ స్టిక్స్ తో పాటు డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణలో కొత్త కోణం బయటికి వచ్చింది.
Conspiracy to Murder BRS MLA Jeevan Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర జరిగిందా..? ఓ ఇంట్లో దాచిపెట్టిన పేలుడు పదార్థాలు అందుకోసమే తీసుకువచ్చారా..? అంటే.. అవుననే సమాధానాలు వస్తున్నాయి. గతంలోనే ఓసారి ఎమ్మెల్యేను హత్య చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించటంతో ఆయనకు భద్రతను కూడా పెంచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి జీవన్ రెడ్డి హత్య కుట్ర జరిగగా… దీన్ని పోలీసులు భగ్నం చేసినట్లు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
ఇంట్లో పేలుడు పదార్థాలు..!
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో రూరల్ పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ మహిళ ఇంట్లో 95 జిలీటెన్ స్టిక్స్, 10 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు... మహిళను విచారించారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలు బయటికి వచ్చాయి. గతంలో బీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పై హైదరాబాద్ లో హత్యాయత్నం జరిగింది. ఆ కేసులో నిందితుడిగా గుర్తించిన ప్రసాద్గౌడ్ ను అరెస్ట్ కూడా చేశారు. అయితే తాజాగా ఈ పేలుడు పదార్ధాలను కూడా ప్రసాద్ గౌడే ఆ మహిళ ఇంట్లో దాచినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సదరు మహిళ ధ్రువీకరించినట్లు సమాచారం. అయితే అతని పేరు మరోసారి రావటంతో ఎమ్మెల్యే హత్యకు కుట్ర చేశాడా..? అన్న కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
ప్రసాద్ ఎక్కడా...?
జీవన్ రెడ్డిపై హత్యాయత్నం కేసుతో పాటు మరో వ్యక్తిపై దాడి చేసిన కేసులో ప్రసాద్ గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద జైలుకు పంపారు. ప్రస్తుతం అతను చంచల్ గూడా జైల్లో జైలులో ఉన్నాడు. అయితే అతను జైల్లో ఉండగా..ఈ పేలుడు పదార్థాలు మహిళ ఇంట్లోకి ఎలా వచ్చాయి...? ఎవరు పెట్టారు..? అనే కోణంలో విచారిస్తున్నారు. ఇప్పటికే సదరు మహిళను అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా పంపారు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ పై క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడిస్తే కానీ ఏం జరిగిందో తెలిసేలా లేదు.