కేసీఆర్ మనసంతా విషంతో నిండిపోయిందని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్ను విలన్లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదన్నారు. మంచి సలహాలు, సూచనలు ఇస్తారేమోనని కేసీఆర్ ప్రసంగం విన్నామని, అందులో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో కేసీఆర్ చేసిన ప్రసంగంపై పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తీరును తప్పుబట్టారు.
'గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైంది. అప్పులున్నా.. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాం. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ను విలన్గా చిత్రీకరిస్తున్నారా? కడుపంతా విషం నింపుకొని కేసీఆర్ మాట్లాడటం బాధ కలిగించింది. రెండుసార్లు అధికారం ఇస్తే.. ఎలా కొల్లగొట్టారో ప్రజలు గమనించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి.. మంచి సలహాలు ఇస్తారని ఎదురుచూశాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐదారు పర్యాయాలు అసెంబ్లీ జరిగింది. కేవలం రెండుసార్లే కేసీఆర్ వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి కూడా కేసీఆర్ వెళ్లలేదు' అని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు.
'సోనియా గాంధీని దేవత అని గతంలో కేసీఆర్ పొగిడారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఎందుకు రుణమాఫీ సరిగా చేయలేకపోయారు. కేసీఆర్ రుణమాఫీ వడ్డీకే సరిపోలేదు. అక్షయపాత్ర లాంటి అవుటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ అమ్ముకున్నారు. అధికారం పోయినా కేసీఆర్ లో గర్వం పోలేదు. సభలో కేసీఆర్ ఒక్కరే ఎందుకు మాట్లాడారు..? చింత సచ్చినా పులుపు చావలేదన్నట్లు గా కేసీఆర్ తీరు ఉంది. కేసీఆర్ అంత నిజాయితీ పరుడు అయితే తన పార్టీకి రూ.1500 కోట్ల ఫండ్ ఎలా వచ్చిందో చెప్పాలి' అని మంత్రి జూపల్లి డిమాండ్ చేశారు.
'ఒక నియంత అధికారాన్ని కోల్పోయి మాట్లాడినట్లు ఉంది కేసీఆర్ స్పీచ్. కుటుంబంలో చీలికలు, పేలికలు పెరుగుతున్నాయన్న బాధ కేసీఆర్ లో కనిపించింది. పది నెలల్లో 59,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం. మీరెంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలి. కేసిఆర్ బిడ్డ మంచి మంచి కార్లలో తిరుగుతుంది.. మా పేద ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో తిరగకూడదా? కేసిఆర్ అంత దరిద్రంగా పోలీసులను ఎవరు వాడుకోలేదు. రూ.60 వేల కోట్ల కరెంట్ బిల్లుల బకాయిలను పెట్టి వెళ్లిపోయారు. ధర్నా చౌకులలో కేసిఆర్ ధర్నాలు కూడా చేయనీలేదు. కేసిఆర్ సభ దగ్గర రైతుల కాలువలను పూడ్చి సభ నిర్వహించారు. సొల్లు కబురు అని కేసిఆర్ అసెంబ్లీని అవమానించారు. మళ్లీ అసెంబ్లీకి వచ్చే అర్హత కేసిఆర్ కు ఉందా?' అని సీతక్క ప్రశ్నించారు.
'కాంగ్రెస్ను విలన్ అని కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. సోనియా గాంధీ మినహా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఇవ్వలేరన్న విషయం కేసీఆర్ కు తెలుసు. కేసిఆర్ సభకు జనం రాకపోతే పోలీసుల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నేపం నెట్టడం సరైనది కాదు. అగ్గిపెట్ట రాజకీయానికి ప్రాణాలర్పించిన తెలంగాణ వాళ్లకు కనీసం నివాళులు అర్పించారా? బీఆర్ఎస్లో అధ్యక్షుడు, ఎల్పీ నాయకుడు అంతా మీరే. సభకు జనం రాకపోవడం వల్లే.. అర్థగంటసేపు కేసీఆర్ ప్రాంగణానికి వచ్చి కూడా వేదిక పైకి రాలేదు' అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం