Nirudyoga March : నిరుద్యోగ మార్చ్.. విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ నేతలు అరెస్ట్
Nirudyoga March : టీఎస్పీఎస్సీ నిర్వహించే.. పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగులు ఆందోళనలు, ధర్నాలు చేపడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నేతలు నిరుద్యోగ మార్చ్ కు పిలుపునిచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ(osmania university)లో నిరుద్యోగుల సమస్యలపై తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ కారణంగా ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి నేతలను పోలీసులు వసతి గృహాల్లోకి వెళ్లి ముందస్తు అరెస్టు చేశారు. అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
పేపర్ లీకేజీ(Paper Leakage) కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇందులో ఆరోపణలు వస్తున్న ప్రతీ ఒక్కరిని ప్రశ్నించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్యాయంగా ఓయూ హాస్టల్(OU Hostels)కు వచ్చి.. అరెస్టు చేస్తున్నారన్నారు. అరెస్టులతో భయపెట్టలేరని, అన్ని యూనివర్సిటీల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం మీద సీబీఐ(CBI) లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
'అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. ముప్పై లక్షలకు పైగా నిరుద్యోగ యువత ఆవేదన మీద సీఎం కేసీఆర్(CM KCR) ఇంకా స్పందించకపోవడం బాధాకరం. టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రశ్నాపత్రాల లీకేజీకి కారకులైన టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను తొలగించాలి.' అని నిరుద్యోగ విద్యార్థి జేఏసీ భీంరావు నాయక్ అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చేపట్టిన నిరుద్యోగ మార్చ్(Nirudyoga March) కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంఘీభావం ప్రకటించారు. దీంతో ముందుగానే పోలీసులు అప్రమత్తయ్యారు. కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్, మల్లు రవితోపాటుగా విద్యార్థి నేతలను హౌస్ అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ప్రతిపక్షాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న నేతలను అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణలో అప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు.
సంబంధిత కథనం