తెలంగాణ కేబినెట్ విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌..! చోటు దక్కేదెవరికో...?-congress high command gives green signal for telangana cabinet expansion ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణ కేబినెట్ విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌..! చోటు దక్కేదెవరికో...?

తెలంగాణ కేబినెట్ విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌..! చోటు దక్కేదెవరికో...?

తెలంగాణ కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రేపే విస్తరణకు ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఆరు ఖాళీలు ఉండగా… ప్రస్తుతం ముగ్గురు లేదా నలుగురిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది.

తెలంగాణ కేబినెట్ విస్తరణ

చాలా రోజులుగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై కసరత్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు కాంగ్రెస్ హైకమాండ్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో కేబినెట్ విస్తరణకు ఏర్పాటు చేసే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

రేపే విస్తరణ…!

ఈ ఆదివారమే(జూన్ 08) మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశముంది. ప్రస్తుతం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో ముగ్గురు లేదా నలుగురికి చోటు దక్కే అవకాశం ఉంది. సామాజికవర్గాల ఆధారంగా ఈ బెర్తులను కేటాయించనున్నారు. ఆ దిశగా పార్టీ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఇవాళ సాయంత్రం రాజ్ భవన్ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు స్థానాలు మాత్రమే ఖాళీ ఉండగా… వీటి కోసం చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. దీంతో కేబినెట్ లో ఎవరికి చోటు దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుత కేబినెట్ లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. విస్తరణలో ఆ నాలుగు జిల్లాలకు కచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంటుందన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది.ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎవరూ లేరు. ఇక్కడ్నుంచి పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

  • కేబినెట్ లో చోటు కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి జి. వివేక్, ప్రేమ్ సాగర్ రావు రేసులో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
  • మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ కోణంలో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పేరును పరిశీలనలో ఉంది. దాదాపు ఆయనకు ఖరారయ్యే అవకాశం ఉందంటున్నారు.
  • ఇక ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉంది. ఈ కోణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉన్న ఎమ్మెల్యే పేరు తెరపైకి వస్తుంది.
  • ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యేతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేతలు కావటంతో…. వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది.
  • ప్రస్తుత కేబినెట్ లో మైనారీవర్గాలకు చెందిన మంత్రి లేరు. దీంతో విస్తరణలో తప్పకుండా మైనార్టీ కోటా నుంచి ఒకరికి ఛాన్స్ దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.
  • ఆరు ఖాళీలు మాత్రమే ఉండి… ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై పార్టీ అధినాయకత్వం లోతుగా కసరత్తు చేయాల్సి వచ్చింది. ఇప్పటికే పలుమార్లు పరిశీలించిన హైకమాండ్…. ప్రస్తుతానికి మూడు లేదా నాలుగింటిని భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్న వేళ… సీటు దక్కించుకునే వారెవరో అన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.