కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్.. ఎదురుకాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి?-combing ongoing for maoists in karregutta on the telangana and chhattisgarh border ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్.. ఎదురుకాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి?

కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్.. ఎదురుకాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి?

దండకారణ్యం దద్దరిల్లుతోంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కర్రెగుట్టలు ఎరుపెక్కుతున్నాయి. తుపాకీ గుళ్ల వర్షం, బాంబుల మోతతో.. ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ను మరింత ముమ్మరం చేశారు. హెలికాప్టర్‌లు, డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలతో బలగాలు కర్రెగుట్టలోకి దూసుకెళ్తున్నాయి.

సాయుధ బలగాల కూంబింగ్ (pixabay)

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్‌ కొనసాగుతోంది. హెలికాప్టర్‌లు, డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలతో.. సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో భారీ స్థాయిలో ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. అయితే.. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి అటు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

శనివారం ఉదయం కాల్పులు..

కర్రెగుట్టలో కేంద్ర పాలరామిలటరీ బలగాల నేతృత్వంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేతలు హిడ్మా, దేవ టార్గెట్‌గా ఐదు రోజులుగా ఈ కూంబింగ్ కొనసాగుతుంది. దాదాపు 20 వేల మంది బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు సమాచారం. శనివారం ఉదయం కర్రెగుట్టలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో మావోయిస్టులు మరణించారని సమాచారం.

ముఖ్యమైన విషయాలు..

1.ఈ కూంబింగ్ ఆపరేషన్లో తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్‌గఢ్ డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొంటున్నాయి.

2.మావోయిస్టుల ముఖ్య నాయకులైన హిడ్మా, దేవ, దామోదర్ వంటి వారు ఈ ప్రాంతంలోనే ఉన్నారనే సమాచారం మేరకు ఈ ఆపరేషన్ జరుగుతోంది.

3.భద్రతా బలగాలు ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి.

4.ఈ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఐఈడీలను అమర్చినట్లు గుర్తించారు. వాటిని నిర్వీర్యం చేసే చర్యలు కొనసాగుతున్నాయి.

5.ఈ ఆపరేషన్‌ను నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

కర్రెగుట్టనే ఎందుకు టార్గెట్..

కర్రెగుట్ట ప్రాంతం మావోయిస్టులకు బలమైన స్థావరంగా ఉంది. ముఖ్యంగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నంబర్ 1 ఇక్కడ ఎక్కువగా సంచరిస్తుంటుంది. ఈ బెటాలియన్ మావోయిస్టుల అత్యంత ప్రమాకరమైన సాయుధ విభాగాలలో ఒకటి. కర్రెగుట్ట తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఇది మావోయిస్టులకు శిక్షణ కార్యకలాపాలు నిర్వహించడానికి అనుకూలమైన ప్రదేశం. ఈ ప్రాంతంపై నియంత్రణ సాధించడం వ్యూహాత్మకంగా ముఖ్యం అని పోలీసులు భావిస్తున్నారు.

అన్ని దారులు బంద్..

హిడ్మాతో సహా దాదాపు 200 మంది మావోయిస్టులను చుట్టుముట్టేందుకు వేలాదిమంది భద్రతా సిబ్బంది మోహరించారు. అతడి జాడను గుర్తించేందుకు డ్రోన్‌లు, హెలికాప్టర్లు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. భద్రతా బలగాలు.. మావోయిస్టుల ఆహారం, నీటి సరఫరా మార్గాలను మూసివేశాయి. మావోయిస్టులు ఎత్తైన కొండలపై తలదాచుకున్నారని తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలపై పైనుంచి ఎదురుదాడి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సంబంధిత కథనం