వరంగల్ నగరానికి విమానాశ్రయం ఎక అసెట్ గా... ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ మామునూరు విమానాశ్రయం కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలన్నారు. నిత్యం రాకపోలు ఉండేలా డిజైన్ రూపకల్పన చేయాలని సూచించారు.
వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగంగా జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ, పెండింగ్ అంశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైన తొందరగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
డిజైనింగ్ కు పంపించే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ... ప్రతి నెల తనకు ప్రగతి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. మామునూరు విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
వరంగల్ జిల్లా మామునూరులో విమానాశ్రయం నిర్మాణానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమాశ్రయానికి 150 కిలో మీటర్ల పరిధిలో మరో విమానాశ్రయానికి అనుమతి ఇవ్వకూడదన్న నిబంధన నేపథ్యంలో గత కొన్నేళ్లుగా మామునూరు విమానాశ్రయం ఏర్పాటు పెండింగ్ లో పడింది. ఇదే విషయంపై హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పాటు జీఎంఆర్ సంస్థతో సంప్రదింపులు జరిపింది.
దీంతో మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ NOC ఇచ్చింది.ఈ NOCని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఫలితంగా మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి 943.14 ఎకరాల భూమి అవసరం కాగా ప్రస్తుతం 696.14 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. దానికి తోడు అదనంగా కావాల్సిన మరో 253 ఎకరాల భూమిని అధికారులు గతంలోనే గుర్తించారు. కానీ భూ సేకరణ అంశం కొన్నాళ్లుగా ఆగుతూ సాగుతూ వచ్చింది. ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు అవసరమైన 253 ఎకరాల భూ సేకరణకు కొద్దిరోజుల కిందటే తెలంగా సర్కార్ రూ.205 కోట్లు విడుదల చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భూసేకరణకు లైన్ క్లియర్ అయినట్లు అయింది. త్వరలోనే ఎయిర్ పోర్టు పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది.
సంబంధిత కథనం