CM Revanth Reddy: బీజేపీని బొంద పెట్టి కేంద్రం నుంచి నిధులు సాధించాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి-cm revanth reddy wants to defeat bjp in mlc elections and secure funds ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy: బీజేపీని బొంద పెట్టి కేంద్రం నుంచి నిధులు సాధించాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy: బీజేపీని బొంద పెట్టి కేంద్రం నుంచి నిధులు సాధించాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి

HT Telugu Desk HT Telugu

CM Revanth Reddy: కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వైఖరి, బీఆర్ఎస్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపి, బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy: కేసీఆర్‌ కుటుంబం కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టలేదని విమర్శించారు. వారి కుట్రలను తిప్పి కొట్టేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిపించి బిజెపిని బొంద పెట్టి తెలంగాణకు రావాల్సిన నిధులు సాధించుకోవాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప సభకు సీఎం రేవంత్ రెడ్డి తోపాటు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ కు కంచుకోట అని సీఎం అన్నారు.

కరీంనగర్ గడ్డమీద సోనియాగాంధీ ఇచ్చిన ప్రత్యేక తెలంగాణ హామిని నిలబెట్టుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ను ఓడించాలంటున్న కేసిఆర్ కేటిఆర్ హరీష్ రావు కవిత...ఎవరికి ఓటు వేయుమని చెబుతున్నారో చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టని బిఆర్ఎస్ మీ మద్దతు ఎవరికో స్పష్టం చేయాలన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే బిజేపి తో లోపాయికారి ఒప్పందంతోనే బిఆర్ఎస్ అభ్యర్థిని పెట్టలేదని ఆరోపించారు. బిఆర్ఎస్ ను బిజెపి ఢిల్లీ నేతలకు కేసిఆర్ తాకట్టు పెట్టారని విమర్శించారు. కేసిఆర్ నీతి, జాతి ఏంటో అడుగుతున్నా చెప్పాలన్నారు

మోడీ పెద్ద బీసీ, బండి సంజయ్ చిన్న బీసీ...

బీసీలకు న్యాయం చేసేందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టి లెక్క తేల్చిందని సీఎం రెవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ లెక్కలు తప్పంటున బిజేపి బిఆర్ఎస్ గత పదేళ్ళలోఎందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు.

మోదీ పెద్ద బిసి, బండి సంజయ్ చిన్న బిసి అని ఇద్దరు బిసిలు కలిసి కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే జనగణన తోపాటు కులగణన చేసి తాను చేసిన లెక్క తప్పని తేల్చండని సవాల్ విసిరారు. బిసీలలో ముస్లీంలను కలుపొద్దు అంటున్న బండి సంజయ్ వాస్తవం తెలుసుకో... నీవు ఇంకా కార్పోరేటర్ వు కాదు... కేంద్ర మంత్రివి అని ఎద్దేవ చేశారు. బిసిలలో 29 ముస్లీం కులాలను 1979లోనే మండలి కమీషన్ చేర్చిందని, బండి సంజయ్ అజ్ఞానంతో మాట్లాడకని హితవు పలికారు.

బీసీలకు న్యాయం ఎక్కడ...

క్రమశిక్షణ గల బండి సంజయ్ అధ్యక్ష సీటును కిషన్ రెడ్డి గుంజుకున్నాడని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను సీఎం అయ్యాక పీసీసీ సీటులో బీసీ అయిన మహేష్ గౌడ్ ను కూర్చో బెట్టామని తెలిపారు. ఎవరు బీసీ పక్షపాతి... కాంగ్రెస్ బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. మా పనితీరు నచ్చకపోతే కాంగ్రెస్ కు ఓటు వేయకండని సూచించారు.

కిషన్ రెడ్డి కుట్ర...

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో మెట్రో రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన అడ్డపడుతూ, మూసిపై విషం చిమ్ముతున్నాడని ఆరోపించారు. శకునిలా రీజినల్ రింగ్ రోడ్డు ను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు.

నరేంద్ర మోడీ … బండి సంజయ్, కిషన్ రెడ్డి కి ఉద్యోగాలు ఇస్తే ఏడాదిలో తాము 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కేంద్రానికి పన్నుల రూపంలో మనం రూపాయి చెల్లిస్తే... కేంద్రం మనకు 42 పైసలు మాత్రమే ఇస్తుందని ఆరోపించారు. తాము చెప్పింది వాస్తవమో కాదో తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు రావాలని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు.

తాను చెప్పింది అబద్ధమైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు ఓటు వేయొద్దని నిజమని నమ్మితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. స్పోర్ట్స్ యునివర్సిటీ, స్కిల్ యునివర్సిటీ వాస్తవమే అయితే కాంగ్రెస్ కు ఓటు వేయండి. చీకటి ఒప్పందంతో కాంగ్రెస్ ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసిఆర్ రైతు బంధు కింద ఇచ్చిన దానికంటే వరి ధాన్యం కొనుగోలులో తప్పతాలు పేరుతో కొట్టేసిందే ఎక్కువని తెలిపారు. పనిమంతుడు పందిరి వేస్తే కుక్కతోక తగిలి కూలినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఉందని ఎద్దేవా చేశారు.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

సంబంధిత కథనం