రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకునే పనిలో ఉంది. తాజాగా ముఖ్యమంత్రి రెడ్డి…ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం నిర్మాణ పనులపై సమీక్షించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు.
తెలంగాణలో వచ్చే 50 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రహదారుల నిర్మాణం, జంక్షన్లు, వాటి మధ్య అనుసంధానత ఉండాలని సూచించారు. ఆర్ఆర్ఆర్ (దక్షిణ భాగం) కు సంబంధించిన అలైన్మెంట్ను పరిశీలించిన అనంతరం….. పలు మార్పులు సూచించారు.
తెలంగాణకు మరో మణిహారంగా రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిలవనుంది. ఆర్ఆర్ఆర్ను 348 కిలోమీటర్ల పొడవున రెండు భాగాలుగా (ఉత్తర, దక్షిణ) నిర్మించనున్నారు. దీనికి పది వేల ఎకరాల వరకు భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ కూడా షురూ అయింది.
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో భూసేకరణతో పాటు ఇతర ప్రాథమిక ప్రక్రియలు మొదలయ్యాయి. మొత్తం ఐదు ప్యాకేజీల్లో చేపడుతున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా దీన్ని నిర్మించనున్నారు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు తోపాటు.. జాతీయ రహదారులు, ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ఛేంజ్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 11 ఇంటర్ఛేంజ్లతో పాటు టోల్ప్లాజాలు, రెస్ట్రూంలు, సర్వీసు రోడ్లు, బస్బేలు, ట్రక్ బేలు నిర్మించనున్నారు.
ఇప్పటికే పలువురు రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. కొందరు బాధితులు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరితో అధికారులు చర్చలు జరుపుతోంది. నష్ట పరిహారం విషయంలో చర్చలు కొలిక్కి వస్తే… ఉత్తర భాగం పనులు పూర్తిస్థాయిలో సుగమం అవుతుందని స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాద్కు చుట్టూ 60 - 70 కిలోమీటర్ల అవతల తెలంగాణలోని పలు ప్రధాన జిల్లాల మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇక దక్షిణ భాగం 182 కిలోమీటర్ల మేర ఉంటుందనేది ప్రాథమిక అంచనా. ఇది సంగారెడ్డి నుంచి కంది,నవాబ్పేట, చేవెళ్ల, షాబాద్, షాద్నగర్, ఆమన్గల్, మర్రిగూడ, సంస్థాన్ నారాయణపూర్ మీదుగా చౌటుప్పల్ వరకు పొడవు విస్తరించి ఉండనుంది. ఇక్కడ కూడా భూసేకరణ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని అధిగమించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
సంబంధిత కథనం