ముందుగానే లైడ‌ర్ స‌ర్వే...! 'ఆర్ఆర్ఆర్' సౌత్ అలైన్‌మెంట్‌ లో మార్పులు-cm revanth reddy suggested several changes to the regional ring road south alignment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ముందుగానే లైడ‌ర్ స‌ర్వే...! 'ఆర్ఆర్ఆర్' సౌత్ అలైన్‌మెంట్‌ లో మార్పులు

ముందుగానే లైడ‌ర్ స‌ర్వే...! 'ఆర్ఆర్ఆర్' సౌత్ అలైన్‌మెంట్‌ లో మార్పులు

రీజినల్ రింగ్ రోడ్డు (దక్షిణ భాగం) నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. అలైన్‌మెంట్‌ను ప‌రిశీలించిన అనంతరం… ప‌లు మార్పులు సూచించారు. ఎటువంటి పొర‌పాట్ల‌కు తావివ్వరాదని అధికారులకు స్పష్టం చేశారు.

రీజినల్ రింగ్ రోడ్డు మ్యాప్

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకునే పనిలో ఉంది. తాజాగా ముఖ్యమంత్రి రెడ్డి…ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం నిర్మాణ పనులపై సమీక్షించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు.

తెలంగాణలో వచ్చే 50 ఏళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా రీజినల్ రింగ్ రోడ్డు, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇత‌ర ర‌హదారుల నిర్మాణం, జంక్ష‌న్లు, వాటి మధ్య అనుసంధాన‌త ఉండాల‌ని సూచించారు. ఆర్ఆర్ఆర్ (దక్షిణ భాగం) కు సంబంధించిన అలైన్‌మెంట్‌ను ప‌రిశీలించిన అనంతరం….. ప‌లు మార్పులు సూచించారు.

ఆర్ఆర్ఆర్(సౌత్) పనులు - సీఎం కీలక సూచనలు:

  • ఆర్ఆర్ఆర్ (దక్షిణ భాగం)కు సంబంధించిన అలైన్‌మెంట్‌కు సంబంధించి అట‌వీ ప్రాంతం, జ‌ల వ‌న‌రులు, మండ‌ల కేంద్రాలు, గ్రామాల విష‌యంలో ముందుగానే లైడ‌ర్ స‌ర్వే చేప‌ట్టాల‌ని ఆదేశించారు.
  • అలైన్‌మెంట్ విషయంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఎటువంటి పొర‌పాట్ల‌కు తావివ్వరాదని స్పష్టం చేశారు.
  • శాటిలైట్ టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుగుణంగా రేడియ‌ల్ రోడ్ల‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
  • ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వ‌రకు అనుసంధానం చేసే రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాలన్నారు.
  • హైద‌రాబాద్ నుంచి వెళ్లే జాతీయ‌, రాష్ట్ర ర‌హదారులు ఆర్ఆర్ఆర్ వెలుప‌లికి వెళ్లే ప్రాంతంలో త‌గు రీతిలో ట్రంపెట్స్ నిర్మించాలి. ఎటువంటి గంద‌ర‌గోళానికి తావులేకుండా, ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా దాటేలా చూడాల‌ని దిశానిర్దేశం చేశారు.
  • హైద‌రాబాద్ - శ్రీ‌శైలం జాతీయ ర‌హ‌దారిలో ఎలివేటెడ్ కారిడార్‌, నూత‌న అలైన్‌మెంట్‌కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు. రాజీవ్ ర‌హ‌దారికి ప్ర‌త్యామ్నాయంగా ఓఆర్ఆర్ నుంచి మంచిర్యాల వ‌ర‌కు నూత‌న ర‌హ‌దారి నిర్మాణానికి సంబంధించి ప్ర‌త్యామ్నాయ అలైన్‌మెంట్‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశించారు.
  • ఆ మార్గంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఉన్న అనుకూల‌త‌ల‌ను ప‌రిశీలించాల‌న్నారు. ఈ నూత‌న ర‌హదారుల‌కు సంబంధించి జాతీయ ర‌హ‌దారుల శాఖ అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు.

తెలంగాణకు మరో మణిహారంగా రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిలవనుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ను 348 కిలోమీటర్ల పొడవున రెండు భాగాలుగా (ఉత్తర, దక్షిణ) నిర్మించనున్నారు. దీనికి పది వేల ఎకరాల వరకు భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ కూడా షురూ అయింది.

రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో భూసేకరణతో పాటు ఇతర ప్రాథమిక ప్రక్రియలు మొదలయ్యాయి. మొత్తం ఐదు ప్యాకేజీల్లో చేపడుతున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా దీన్ని నిర్మించనున్నారు. ప్రధానంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు తోపాటు.. జాతీయ రహదారులు, ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 11 ఇంటర్‌ఛేంజ్‌లతో పాటు టోల్‌ప్లాజాలు, రెస్ట్‌రూంలు, సర్వీసు రోడ్లు, బస్‌బేలు, ట్రక్‌ బేలు నిర్మించనున్నారు.

ఇప్పటికే పలువురు రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. కొందరు బాధితులు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరితో అధికారులు చర్చలు జరుపుతోంది. నష్ట పరిహారం విషయంలో చర్చలు కొలిక్కి వస్తే… ఉత్తర భాగం పనులు పూర్తిస్థాయిలో సుగమం అవుతుందని స్పష్టం చేస్తున్నారు.

హైదరాబాద్‌కు చుట్టూ 60 - 70 కిలోమీటర్ల అవతల తెలంగాణలోని పలు ప్రధాన జిల్లాల మీదుగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇక దక్షిణ భాగం 182 కిలోమీటర్ల మేర ఉంటుందనేది ప్రాథమిక అంచనా. ఇది సంగారెడ్డి నుంచి కంది,నవాబ్‌పేట, చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, ఆమన్‌గల్, మర్రిగూడ, సంస్థాన్‌ నారాయణపూర్‌ మీదుగా చౌటుప్పల్‌ వరకు పొడవు విస్తరించి ఉండనుంది. ఇక్కడ కూడా భూసేకరణ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని అధిగమించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం