Invest In Telangana : హైదరాబాద్ లో మరో డేటా సెంటర్, రూ.3500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీటీ ఒప్పందం
Invest In Telangana : తెలంగాణలో రూ.3500 కోట్ల పెట్టుబడులకు సింగపూర్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం, సింగపూర్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. హైదరాబాద్లో ఏఐ ఆధారిత డేటా సెంటర్ఏర్పాటుకు ఈ సంస్థ ముందుకొచ్చింది.
Invest In Telangana : సీఎం రేవంత్ రెడ్డి బృందం రెండో రోజు సింగపూర్ లో పర్యటిస్తుంది. రాష్ట్రంలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్ పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ఆఫీస్ ను సందర్శించారు. ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్ లో ఏర్పాటు చేసే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ డేటా సెంటర్ ను ఈ కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పనుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది. దాదాపు రూ. 3,500 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆ కంపెనీ ముందుకురావటం తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలను, ప్రపంచస్థాయి అనుకూలతలను చాటి చెప్పింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే హైదరాబాద్ డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నందుకు ఎస్టీటీ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులను అభినందించారు.
తెలంగాణతో కలిసి పని చేయటం గౌరవంగా ఉందని ఎస్టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ అన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహకంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం అందించే సహకారంతో ఆర్థికవృద్ధితో పాటు ఉపాధి కల్పన, స్థిరమైన డిజిటల్ భవిష్యత్తు నిర్మించాలనే ఉమ్మడి లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ప్రపంచానికి హైదరాబాద్ డేట్ హబ్ గా మారుతుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగంలో వస్తున్న వినూత్న మార్పుల్లో హైదరాబాద్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు.
ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ ప్రస్తుతం హైదరాబాద్లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్ను నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ కంపెనీ పదేండ్లలో మన దేశంలో ఒక గిగావాట్ సామర్థానికి విస్తరించాలనే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణలో పెట్టుబడులు పెడుతోంది. దశాబ్దంలో ఈ కంపెనీ దాదాపు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుందని అంచనా.
సంబంధిత కథనం