Gaddar Jayanti : గద్దరన్నను మరోసారి కించపరిస్తే.. మీ పార్టీ ఆఫీస్ అడ్రస్ మార్చుకోవాల్సి వస్తుంది : రేవంత్ రెడ్డి
Gaddar Jayanti : హైదరాబాద్లోని రవింద్రభారతిలో గద్దర్ జయంతి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బండి సంజయ్, కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు.
గద్దర్ కుటుంబం సర్వం కోల్పోయింది.. వారు ఏనాడు కంటి నిండా నిద్రపోలేదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిరంతరం గద్దర్ ప్రజల్లో ఉన్నారన్న సీఎం.. తన గళంతో సమాజానికి స్పూర్తినిచ్చారని కొనియాడారు. గద్దర్తో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గత పదేళ్లలో రాజకీయ పరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు.. ఒంటరిగా అనిపించినప్పుడు.. గద్దర్తో మాట్లాడేవాన్నని చెప్పారు. పోరాటానికి ప్రజల గుర్తింపు ఉంటుందని.. స్పూర్తిని నింపేవారని గుర్తుచేశారు.
గద్దర్కు ఒక పేజీ ఉండేలా..
'చరిత్రపుటల్లో గద్దర్కు ఒక పేజీ ఉండేలా నిర్ణయం తీసుకోవాలని భావించాం. గద్దర్కు లక్షలాది మంది అభిమానులున్నారు. ఒక గొప్ప వ్యక్తిని గుర్తించడం ద్వారా భవిష్యత్త్ తరాలకు స్పూరినివ్వాలని.. ప్రభుత్వం ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. గద్దర్ అవార్డును ఏర్పాటు చేసి.. భట్టి విక్రమార్కకు బాధ్యత అప్పగించాం. గద్దర్ మరణం సమాజానికి చేరకుండా ఆ నాటి ప్రభుత్వం ప్రయత్నించింది. గద్దర్ ఒంటరి కాదు. ఆయనకు అందరం ఉన్నామని చెప్పి ఎల్బీ స్టేడియానికి భౌతికకాయాన్ని ప్రజల సందర్శన కోసం తీసుకెళ్లాం' అని రేవంత్ రెడ్డి వివరించారు.
సిద్ధాంతకర్తగా చూడాలి..
'ఆనాటి ప్రభుత్వం ఎల్బీ స్టేడియం గేట్లకు తాళాలు వేస్తే.. అధికారులను హెచ్చరించి తెరిపించాను. ఒక వీరుడి మరణం స్పూర్తిని అందరం తీసుకున్నాం. లక్షలాది మంది యోధులను, పోరాట స్పూర్తిని ఇచ్చిన సిద్ధాంతకర్తగా గద్దర్ను చూడాలి. గద్దర్ సైద్దాంతిక కట్టుబాటుతో చివరి శ్వాస వరకు కొనసాగారు. చుక్కా రామయ్య, అందె శ్రీ, జయధీర్ తిరుమల్ రావు, గోరేటి వెంకన్న, గద్దర్కు పద్మ అవార్డులు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించాం. వీరెవ్వరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
తెలంగాణ వారు ఎందులో తక్కువ?
'కేంద్ర ప్రభుత్వం అనేది మిథ్య. రాష్ట్రాల కలయికనే దేశం. నాతో విభేదించినా.. నాలుగు కోట్ల సమాజం కోసం మమేకం అయినవారిని గుర్తించాలన్నదే మా అభిమతం. పక్క రాస్ట్రంలో ఐదుగురికి పద్మ అవార్డులు ఇచ్చారు. తెలంగాణ ప్రతిపాదించిన ఐదుగురు ఎందులో తక్కువ? అవార్డుల విషయంలో నిరసనను తెలియజేస్తూ.. ప్రధానమంత్రికి లేఖ రాశాం. భవిష్యత్తులోనైనా తమ తప్పును సరిదిద్దుకుంటారని భావించాం' అని రేవంత్ చెప్పారు.
అడ్రస్ మార్చుకోవాల్సి వస్తుంది..
'కేంద్ర మంత్రి ఒకరు ఇష్టానుసారంగా మాట్లాడారు. గద్దరన్నను మరోసారి కించపరిస్తే ఆ పార్టీ ఆఫీస్ అడ్రస్ మార్చుకోవాల్సి వస్తుంది. నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది గుర్తుపెట్టుకో. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా.. ఏం చేస్తారు. గద్దర్ను గేటు బయట కూర్చొపెట్టిన ఆయన గేట్లు బద్దలు అయ్యాయి. గేటు బయట కూర్చొపెట్టిన ఆయనకు పట్టిన గతే.. బీజేపీ నాయకులకు పడుతుంది. కేంద్రాన్ని ఇక అడగం.. మేమే సంతకం పెడతాం.. సైద్దాంతిక విభేదాలపైన చర్చ చేసే వాళ్లు, గౌరవించే వాళ్లు లేరా?' అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
గద్దర్ గౌరవాన్ని పెంచేలా..
'గద్దర్ను వ్యక్తులు గుర్తించనంత మాత్రాన విలువ తగ్గదు. కోహినూర్ వజ్రం విలువ ఏనాడు తగ్గదు. మహాత్మా గాంధీనే గుర్తించని వారు గద్దర్ను గుర్తిస్తారని ఎలా అనుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం గొప్ప వ్యక్తుల గౌరవం తగ్గకుండా చూస్తుంది. జీవో ఇచ్చేంత వరకు గద్దర్ కూతురు వెన్నెలకు పదవి ఇస్తున్నట్లు తెలియదు. గద్దర్ స్పూర్తిని కొనసాగించడానికి ప్రభుత్వాన్ని ఆశ్వీరదించండి. కంచె అయిలయ్య సూచన మేరకు మహిళా యూనివర్సిటీకి చాకలి అయిలయ్య పేరు పెట్టాం. ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు. సలహాలు, సూచనలను పాటిస్తుంది. గద్దర్ గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. నెక్లెస్ రోడ్లో గద్దర్ మెమోరియల్ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకుంటాం' అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.