మిస్ వరల్డ్ 2025 పోటీలను విజయవంతం చేద్దాం.. అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం-cm revanth reddy reviews the organization of miss world 2025 competitions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మిస్ వరల్డ్ 2025 పోటీలను విజయవంతం చేద్దాం.. అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం

మిస్ వరల్డ్ 2025 పోటీలను విజయవంతం చేద్దాం.. అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం

మిస్ వరల్డ్ 2025 పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే ప్రపంచ స్థాయి పోటీల నిర్వహణకు.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు.

సమీక్షలో సీఎం రేవంత్

తెలంగాణ ఖ్యాతిని విశ్వమంతటా పరిచయం చేసేందుకు ఉపయోగపడే మిస్ వరల్డ్ 2025 వేడుకలను.. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా వారికి ఆతిథ్యమివ్వాలని దిశానిర్దేశం చేశారు.

పోటీల నిర్వహణపై సమీక్ష..

మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీదారులతో పాటు దేశ విదేశాల నుంచి ఈవెంట్ కవరేజీకి దాదాపు మూడు వేల మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. వివిధ దేశాల నుంచి పోటీలకు వచ్చే వారిని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతించాలని సూచించారు. పోటీలు పూర్తయ్యేంత వరకు ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

సమన్వయంతో పని చేయాలి..

'పోటీల నిర్వహణకు పర్యాటక శాఖతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలి. అధికారులందరూ సమర్థంగా తమకు అప్పగించిన బాధ్యతలు నిర్వహించాలి. మే 10 నుంచి 31వ తేదీ వరకు వరుసగా జరిగే కార్యక్రమాల షెడ్యూలుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయాలి. ప్రతి కార్యక్రమానికి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలి. మే 10వ తేదీన సాయంత్రం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్డేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభోత్సవం నుంచి.. 31వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలే వరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి' అని ముఖ్యమంత్రి సూచించారు.

భద్రత కట్టుదిట్టంగా ఉండాలి..

'హైదరాబాద్‌లోని చార్మినార్​, లాడ్ బజార్​, తెలంగాణ తల్లి, సెక్రెటేరియట్​తో పాటు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన రవాణా, వసతులు కల్పించాలి. అక్కడ భద్రత కట్టుదిట్టంగా ఉండేలా చూసుకోవాలి. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా.. వాటిని అధిగమించే ప్రత్యామ్నాయ ప్రణాళికలను అధికారులు రూపొందించుకోవాలి' అని అధికారులు రేవంత్ ఆదేశించారు.

అప్రమత్తంగా ఉండాలి..

'మహిళా సాధికారతను చాటిచెప్పేలా రాష్ట్రంలో ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ సందర్శనతో పాటు, ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సెమీఫైనల్స్ తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. హైదరాబాద్​లో మిస్ వరల్డ్ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో.. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణ సూచనలకు అనుగుణంగా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. ఈదురు గాలులు, వర్షాలు వచ్చినా గ్రేటర్ సిటీ పరిధిలో ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా విభాగాలు అప్రమత్తంగా ఉండాలి' అని సీఎం స్పష్టం చేశారు.

విద్యార్థులకు చూపించండి..

'మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే విదేశీ అతిథులు బస చేసే హోటళ్లతో పాటు.. గచ్చిబౌలి స్టేడియం, చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సెక్రెటేరియట్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలి. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులను ప్రభుత్వం తరఫున మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, బీసీ, ఎస్సీ ఎస్టీ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కస్తూరిబా పాఠశాలలకు చెందిన విద్యార్థులను కూడా ఒకరోజు మిస్ వరల్డ్ వేడుకలు చూపించాలి. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

సంబంధిత కథనం