మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎయిర్పోర్టు, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసులకు సూచించారు. ఈ పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిస్ వరల్డ్ 2025 పోటీలు తెలంగాణ మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జరుగుతాయి.
'పోటీల్లో పాల్గొనడానికి వచ్చేవారు.. తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. నగరంలో పెండింగ్లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలి. మిస్ వరల్డ్-2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలి' అని సీఎం ఆదేశించారు.
గ్రాండ్ ఫినాలే: మే 31, 2025, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్.
మిస్ వరల్డ్ టాప్ మోడల్ & ఫ్యాషన్ ఫైనల్: మే 24, 2025, హైటెక్స్
నగలు, ముత్యాల ఫ్యాషన్ షో: మే 25, 2025, హైటెక్స్
గాలా డిన్నర్: మే 26, 2025, బ్రిటిష్ రెసిడెన్సీ/తాజ్ ఫలక్నుమా.
ప్రారంభ వేడుక: మే 10, 2025, గచ్చిబౌలి, ఇండోర్ స్టేడియం.
మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్: మే 17, 2025, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం.
ఖండాంతర ఫైనల్స్: మే 20-21, 2025, టి-హబ్.
మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్: మే 22, 2025, శిల్పకళా వేదిక.
హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ ఫైనల్: మే 23, 2025, ఐఎస్బీ.
ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పర్యాటక శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించి, రాబోయే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని కళలు, సంస్కృతి, చారిత్రక ప్రదేశాలను వారికి పరిచయం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా, ఈ పోటీల ద్వారా తెలంగాణ పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తెలంగాణ వైపు ఆకర్షితులవుతారని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ పోటీలలో భాగంగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్లో స్వాగత విందు వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. పోటీదారులు రామప్ప దేవాలయం, యాదగిరిగుట్ట దేవాలయం, పోచంపల్లి వంటి వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తారు. తెలంగాణ చేనేత, కళాకృతులను ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి దాదాపు 3 వేల అంతర్జాతీయ మీడియా సంస్థలు వస్తాయని అంచనా.
సంబంధిత కథనం