CM Revanth Reddy : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక, బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Revanth Reddy : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించాలని ఆదేశించారు.

CM Revanth Reddy : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు.
అక్రమ రవాణాపై కఠిన చర్యలు
ఇసుక అక్రమ రవాణా విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని చెబుతూ అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా జరగాలని, విధి నిర్వహణలో పర్మనెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలంటూ సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఇసుక బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. అందుకు జిల్లాల వారిగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలి.
48 గంటల్లో డెలివరీ
"ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలి. ప్రతి రీచ్ వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలి. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలి. రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేయాలి. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి. ప్రాంతాల వారిగా సమీప రీచ్ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా వ్యవస్థ ఏర్పడాలి" - సీఎం రేవంత్ రెడ్డి
ఆన్ లైన్ బుకింగ్ లో మార్పులు
'ఇసుక రవాణాలో సమస్య తలెత్తినప్పుడు వెంటనే పరిష్కారం జరగాలి. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి. ఆన్లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులు జరగాలి. ఆఫీస్ టైమింగ్స్లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళల్లో మార్పు చేయాలి'- సీఎం రేవంత్ రెడ్డి
సంబంధిత కథనం