CM Revanth Reddy : ఎంత ఖర్చయినా కానివ్వండి... మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం - సీఎం రేవంత్ రెడ్డి
ఎంత ఖర్చయినా కానివ్వండి కానీ మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామన్న విషయాన్ని పునరుద్ఘాటించారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామన్నారు.నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.
ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా నల్గొండలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... “ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది” అని అన్నారు.
రైతుల సంక్షేమం, మూసీ పునరుజ్జీవం, నల్గొండ జిల్లా సమస్యలను సీఎం రేవంత్ ప్రధానంగా ప్రస్తావించారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామన్న విషయాన్ని పునరుద్ఘాటించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం :
- "మూసీ ప్రక్షాళన చేయకపోతే నల్గొండ ప్రజలు జీవించలేని పరిస్థితులు తలెత్తబోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఫ్లోరైడ్ బారిన పడి నల్గొండ ప్రజలు అనేక విధాలుగా నష్టపోయారు.
- మూసీలో కొట్టుకొచ్చే శవాలు, కళేబరాల నుంచి విముక్తి కలిగించి ఈ జిల్లాలో వ్యవసాయానికి, తాగునీటికి ఉపయోగపడే విధంగా గోదావరి నుంచి నీటిని తరలించి కృష్ణా నదిలో కలిసే వరకు ప్రాజెక్టును పూర్తి చేస్తాం.
- నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది.
- ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాలను ప్రవహింపజేసి దేశానికే తలమానికంలా నిలబెట్టాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోంది.
- ప్రపంచంలోనే పొడవైన 44 కిలోమీటర్ల ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను పూర్తి చేసి 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు తాగునీటిని ఇవ్వాలని ఆనాడు ప్రణాళికలు సిద్దం చేశాం.
- బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించాం. కానీ గడిచిన పదేళ్ల ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.
- ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా పోరాటాల గడ్డ నల్గొండ జిల్లాలో ఉత్సవాలు చేసుకోవడం సంతోషకరం.
- 21 వేల కోట్ల రూపాయలతో 25 లక్షల మంది రైతులకు 2 లక్షల మేరకు రుణమాఫీ చేశాం. ఒక్క నల్గొండ జిల్లాలోనే 2400 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగింది.
- 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు రూ. 500 బోనస్ ఇచ్చాం.
- అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ప్రభుత్వ పరంగా 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే ఏ రాష్ట్రానికి లేదు.
- నల్గొండ రింగ్ రోడ్డును పూర్తి చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని కట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది"అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
సంబంధిత కథనం