మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రానికి వెల్లువెత్తిన పెట్టుబడులు, రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు ప్రణాళిక తయారు చేసుకోవాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో విపరీతంగా పెరుగుతున్న విద్యుత్ వినియోగం, సప్లైపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.పరిశ్రమలతో పాటు గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, మాస్ ట్రాన్స్పోర్టేషన్ (మెట్రో, ఎలక్ట్రికల్ వెహికిల్స్) దృష్టిలో ఉంచుకొని పునరుత్పాదక విద్యుత్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రేవంత్ సూచించారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను ముందస్తుగా అంచనా వేసి.. రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
2.రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల వచ్చే మూడేండ్లలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మూడేండ్ల విద్యుత్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
3.గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఇది ఒక గొప్ప విజయం. అయినప్పటికీ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది.. అని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
4.ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుంది. 2025–26 లో 18,138 మెగావాట్లు, 2034.35 నాటికి 31,808 మెగావాట్ల కు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని.. భవిష్యత్తు అవసరాలు, అంచనాలను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి నివేదించారు.
5.పెరుగుతున్నవిద్యుత్తు అంచనాలకు సరిపడేలా ఉత్పత్తిని పెంచుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రధానంగా క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ పైన దృష్టి సారించాలని ఆదేశించారు. ప్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపైన దృష్టి సారించాలని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు అవకాశం ఇవ్వాలని సూచించారు.
6.నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలని, మెట్రో విస్తరణ, రైల్వే లైన్లు, ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని, కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
7.గ్లోబల్ కెపబులిటీ సెంటర్ల హబ్గా హైదరాబాద్ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని సీఎం రేవంత్ వివరించారు. భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా మారబోతుందని, హైదరాబాద్లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
8.ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఎతో సమన్వయం చేసుకోవాలని.. విద్యుత్తు శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
9.క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలని.. సీఎం రేవంత్ ఆదేశించారు. విద్యుత్ లైన్ల ఆధునీకరణ పైన దృష్టి సారించాలని.. ఫ్యూచర్ సీటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
10.ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీల్లేదని, హై టెన్షన్ లైన్లను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సెక్రటేరియట్, నక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో ముందుగా ప్రయత్నించాలని సూచించారు.
సంబంధిత కథనం