TG Caste Survey : బలహీన వర్గాలకు.. కులగణన నివేదికే బైబిల్, భగవద్గీత, ఖురాన్ : రేవంత్ రెడ్డి-cm revanth reddy interesting comments on the caste census conducted in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Caste Survey : బలహీన వర్గాలకు.. కులగణన నివేదికే బైబిల్, భగవద్గీత, ఖురాన్ : రేవంత్ రెడ్డి

TG Caste Survey : బలహీన వర్గాలకు.. కులగణన నివేదికే బైబిల్, భగవద్గీత, ఖురాన్ : రేవంత్ రెడ్డి

TG Caste Survey : ప్రజాభవన్‌లో బీసీ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఆషామాషీగా చేసిన సర్వే కాదని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యీలు, నాయకులు హాజరయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి

ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించామని.. బలహీన వర్గాలకు కులగణన నివేదికే బైబిల్, భగవద్గీత, ఖురాన్.. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కులగణన ఎక్స్‌రే లాంటిదని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే.. కులగణన చేయాల్సిందేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని రేవంత్ వివరించారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కులగణన చేసి తీరుతామని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మాట ఇచ్చారని.. గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని రేవంత్ వ్యాఖ్యానించారు.

నాయకుడి మాటను అమలు చేస్తున్నాం..

'మన నాయకుడు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి సాహసం చేయలేదు. కానీ తెలంగాణలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం అందరి భాగస్వామ్యంతో కులగణన నిర్వహించాం. సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడకగా ఉందనే.. ఆనాటి ప్రభుత్వం లెక్కలను బయటపెట్టలేదు. అందుకే ఆ వివరాలను ఎన్నికల కోసం వాడుకున్నారు. ప్రజల కోసం వినియోగించలేదు. కానీ మేం చిత్తశుద్ధితో కులగణనపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం' అని ముఖ్యమంత్రి వివరించారు.

పకడ్బందీగా నిర్వహించాం..

'చట్టపరంగా ఇబ్బందులు కలగకుండా ప్లానింగ్ డిపార్ట్ మెంట్‌కు అప్పగించి కులగణను పకడ్బందీగా నిర్వహించాం. ఇంటింటికి ఎన్యుమరేటర్లను పంపి సమాచారాన్ని సేకరించాం. సేకరించిన సమాచారాన్ని తప్పులు దొర్లకుండా ఎన్యూమరేటర్ సమక్షంలో కంప్యూటరీకరించాం. తప్పులు జరిగాయని మాట్లాడుతున్న వారు ఏ బ్లాక్‌లో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలి. ప్రక్రియను తప్పుబట్టడం ద్వారా మొత్తం వ్యవస్థను కుప్పకూల్చేందుకు కుట్రలు చేస్తున్నారు. దీన్ని బీసీ సోదరులు గమనించాలి' అని రేవంత్ విజ్ఞప్తి చేశారు.

దీనిపై కొందరు కుట్ర చేస్తున్నారు..

'స్వతంత్ర భారతదేశంలో ఎవ్వరూ ఇప్పటివరకు కులగణన చేపట్టలేదు. ఒక్కసారి బీసీల లెక్క తెలిస్తే.. వాటా అడుగుతారనే దీనిపై కొందరు కుట్ర చేస్తున్నారు. ఎంతోకాలంగా ఉన్న డిమాండ్‌ను మనం విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నాం. బీజేపీలో ఉన్న ఒకటి రెండు ఆధిపత్య సామాజిక వర్గాలకు నష్టం జరుగుతుందనే.. వాళ్లు కులగణనపై కుట్రలు చేస్తున్నారు. దేశంలో కులగణన చేపట్టడం ఇష్టంలేకనే.. బీజేపీ నేతలు కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు' సీఎం ఆరోపించారు.

లెక్క తగ్గిందో పెరిగిందో చెప్పండి..

'కేసీఆర్ సర్వే ప్రకారం బీసీలు 51 శాతం మాత్రమే. కానీ మన కులగణన ప్రకారం 56.33 శాతం. ఇక బీసీల లెక్క తగ్గిందో పెరిగిందో మీరే చెప్పండి. గుజరాత్‌లో ముస్లింలు ఓబీసీ కేటగిరీలో ప్రయోజనం పొందుతున్నారని.. తాను ఎప్పుడూ మీడియాలో చెప్పుకోలేదని మోదీ 2023లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ బండి సంజయ్ మాత్రాం రేవంత్ రెడ్డి బీసీలలో ముస్లింలను కలిపారని చెబుతున్నాడు' అని రేవంత్ ఫైర్ అయ్యారు.

సవాల్ విసురుతున్నా..

'తప్పుడు మాటలు మాట్లాడటం కాదు.. ఏ బ్లాక్‌లో.. ఏ ఇంట్లో తప్పు జరిగిందో నిరూపించాలని కేసీఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. భవిష్యత్‌లో దేశంలో బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించాలంటే.. తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఈ అవకాశాన్ని జారవిడిచుకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. నేను రాజకీయ అజ్ఞానంతో మాట్లాడటంలేదు. మా నాయకుడి ఆదేశాలు పాటించే వ్యక్తిగా మాట్లాడుతున్న. నాయకుడి ఆదేశాలను పాటించడమే నా ధర్మం' అని రేవంత్ స్పష్టం చేశారు.

నూరు శాతం పక్కా..

'ఈరోజు మనం చేసిన లెక్క నూటికి నూరు శాతం పక్కా. ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. మోదీ రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనే.. ఈ ప్రక్రియను తప్పుబడుతున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉద్యోగాలు పోతాయనే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. పకడ్బందీ ప్రక్రియతో కులగణన చేశాం. దీన్ని కాపాడుకుని ప్రజల్లోకి తీసుకెళ్లండి. ప్రక్రియ పూర్తి చేయడంతో నా బాధ్యత పూర్తయింది. దీన్ని పట్టాలెక్కించి గమ్యం చేర్చే వరకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.