ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. జహీరాబాద్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్-cm revanth reddy interesting comments at zaheerabad public meeting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. జహీరాబాద్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. జహీరాబాద్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాము తప్పులు చేస్తే సరిదిద్దుకుంటామని చెప్పారు. మెదక్ ప్రాంతానికి.. ఇందిరమ్మకు ఉన్న అనుబంధం విడదీయలేనిదని రేవంత్ వ్యాఖ్యానించారు.

సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

మెదక్ పేరు గుర్తొస్తేనే.. ఇందిరమ్మను తలచుకుంటాం.. ఇందిరమ్మ గుర్తొచ్చిన ప్రతీసారి మెదక్ గుర్తొస్తుందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన చివరి శ్వాస వరకు మెదక్ ఎంపీగా కొనసాగిన నాయకురాలు ఇందిరమ్మ అని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందన్న సీఎం.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిమ్జ్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచి, భూసేకరణను వేగవంతం చేశామని వివరించారు.

ఆ బాధ్యత జగ్గారెడ్డికి..

'త్వరలో హ్యుందాయ్ కార్ల తయారీ కంపెనీ ఇక్కడ పనులు మొదలుపెడతారని చెప్పడానికి సంతోషిస్తున్నా. నిమ్జ్ భూ నిర్వాసితులైన 5612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదికగా ప్రకటిస్తున్నా. ఆ కుటుంబాలకు భోజనాలు పెట్టి ఇండ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నాం. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నా. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తాం' అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

మెదక్ జిల్లా అభివృద్ధికి నిధులు..

'ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. అభివృద్ధిలో అందరినీ కలుపుకుని ముందుకు వెళతాం. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని నా దృష్టికి తీసుకొచ్చారు. నారాయణఖేడ్ కు సురేష్ షెట్కర్, సంజీవరెడ్డి రెండు కళ్లలాంటివారు. నారాయణఖేడ్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తాం. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

సంక్షేమమే ధ్యేయంగా..

'రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచాం. భూమిలేని పేదలకూ భరోసా అందిస్తున్నాం. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ. 500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. స్వయం సహాయక సంఘాల మహిళలకు బస్సులను అందించి వారిని ప్రోత్సహిస్తున్నాం. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాలనే కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా.. ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం' అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.

ఎన్నిసార్లయినా కలుస్తా..

'ఇంటికో ఉద్యోగం అని చెప్పిన ఆయన.. తన ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకుని నిరుద్యోగ యువతను మోసం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటాం. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లయినా కలుస్తాం. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని ముందుకెళ్తాం' అని సీఎం చెప్పారు.

అప్పటిదాకా నిద్రపోను..

'ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.. శాసనసభకు రండి.. ప్రజా సమస్యలపై చర్చించండి. మేం ఏదైనా తప్పులు చేస్తే సూచనలు ఇవ్వండి.. సరిదిద్దుకుంటాం. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తామని మీరు అనుకుంటే.. ప్రజలు గుణపాఠం చెబుతారు. ప్రజాప్రతినిధులుగా నిత్యం ప్రజలకు అండగా ఉండాలి. గెలిచినా, ఓడినా నేను ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నా. ముఖ్యమంత్రి అయ్యాక కూడా నేను ఏనాడు అహంభావం ప్రదర్శించలేదు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ కలుస్తున్నా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే వరకు నేను నిద్రపోయేది లేదు' అని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.

సంబంధిత కథనం