Global Madiga Day : నా రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజికవర్గం పాత్ర ఎంతో ఉంది : రేవంత్ రెడ్డి
Global Madiga Day : అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అందరికంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాం.. అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉందని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారు.. మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలియజేశామని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించాం. దామోదర రాజనర్సింహ నేతృత్వంలో న్యాయవాదులను నియమించాం. సుప్రీంకోర్టులో తీర్పు దానంతట అదే రాలేదు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో క్రియాశీల పాత్ర పోషించింది. సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తామని శాసనసభ వేదికగా మేం స్పష్టంగా ప్రకటించాం' అని రేవంత్ స్పష్టం చేశారు.
'తెలంగాణ సమస్యలా ఈ సమస్య జఠిలం అయింది. కానీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ వాదనలో బలం ఉంది. మీకు న్యాయం చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేలా అధ్యయనం చేసేందుకు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం వేశాం. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జ్యుడీషియల్ కమిషన్ను కూడా నియమించాం. మరో వారం రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది' అని సీఎం వివరించారు.
'సీఎం పేషీలో మాదిగలు ఉండాలని డా.సంగీతను నియమించుకున్నాం. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. వీసీగా ఒక మాదిగ సామాజిక వర్గం వ్యక్తిని నియమించాం. విద్యా కమిషన్ మెబర్గా, ఉన్నత విద్యాశాఖలో మాదిగ సామాజికవర్గానికి అవకాశం కల్పించాం. పగిడి పాటి దేవయ్యను స్కిల్ యూనివర్సిటీ బోర్డు డైరెక్టర్గా నియమించుకున్నాం. అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అందరికంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాం' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
'ఈ ప్రభుత్వం మీకు అన్యాయం జరగనివ్వదు. న్యాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తాం. అమలు చేయడంలో కొంత ఆలస్యం కావచ్చు. కానీ మీకు తప్పక న్యాయం చేస్తాం. నా రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉంది. ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత నాది' అని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.