నర్సింగ్ కాలేజీల్లో జపాన్ భాషను నేర్పించాలి - సీఎం రేవంత్ రెడ్డి-cm revanth reddy instructs officials to teach japanese language in nursing colleges ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  నర్సింగ్ కాలేజీల్లో జపాన్ భాషను నేర్పించాలి - సీఎం రేవంత్ రెడ్డి

నర్సింగ్ కాలేజీల్లో జపాన్ భాషను నేర్పించాలి - సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. కాలేజీలన్నీ పూర్తి స్థాయి వ‌స‌తుల‌తో ప‌ని చేయాల‌ని స్పష్టం చేశారు. నర్సింగ్ కాలేజీల్లో జపాన్ భాషను నేర్పించాల‌ని.. ఆ దిశగా కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని 34 వైద్య కళాశాల‌లు పూర్తి స్థాయి వ‌స‌తుల‌తో ప‌ని చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను వెంట‌నే త‌యారు చేయాల‌న్నారు. ఇందుకోసం అధికారుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని చెప్పారు.

ఈ క‌మిటీ రాష్ట్రంలోని ప్ర‌తి క‌ళాశాల‌ను సంద‌ర్శించి సమగ్రమైన వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి జాతీయ వైద్య మండలి లేవనెత్తిన పలు అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

సీఎం రేవంత్ సమీక్ష - కీలక సూచనలు

  • "ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల్లో నియామ‌కాలు, బోధ‌న సిబ్బంది ప్ర‌మోష‌న్లు, వాటికి అనుబంధంగా ఉన్న ఆసుప‌త్రుల్లో ప‌డ‌క‌ల పెంపు, ఆయా క‌ళాశాల‌ల‌కు అవ‌స‌ర‌మైన వైద్య ప‌రిక‌రాలు, ఖాళీల భ‌ర్తీ వంటి అన్ని అంశాలపైనా స‌మ‌గ్ర నివేదిక రూపొందించాలి.
  • రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి విడుద‌ల చేయాల్సిన నిధులను వెంట‌నే విడుద‌ల చేస్తాం.
  • కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమ‌తులకు సంబంధించిన అంశాలుంటే వెంట‌నే తెలియజేయాలి. కేంద్ర మంత్రి జేపీ న‌డ్డాతో పాటు ఆ శాఖ అధికారుల‌ను సంప్ర‌దించి వాటిని ప‌రిష్క‌రిస్తాం.
  • న‌ర్సింగ్ క‌ళాశాల‌ల్లో జ‌ప‌నీస్ (జ‌పాన్ భాష‌) ను ఒక ఆప్ష‌నల్‌గా నేర్పించాలి. జ‌పాన్‌లో న‌ర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉంది. ఈ విష‌యంలో మ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు జ‌పాన్ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది.
  • ఆసుప‌త్రుల‌కు వ‌చ్చే రోగులు, వారిని ప‌రీక్షించే వైద్యులు, ఆసుప‌త్రుల స‌మ‌యాల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఒక యాప్‌ను వినియోగించే అంశంపై అధ్య‌య‌నం చేయాలి.
  • విద్యా, వైద్య రంగాలు ఎంతో కీల‌క‌ం. ప్ర‌తి నెలా మూడో వారంలో ఈ రెండు శాఖ‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించాలి" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ ను ఆదేశించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.