ఫిబ్రవరి 10 వ తేదీలోగా అత్యుత్తమ పర్యాటక విధానం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశ, విదేశాల్లోని అత్యుత్తమ పాలసీని అధ్యయనం చేసి తెలంగాణ పర్యాటక పాలసీని రూపొందించాలని చెప్పారు.
బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూరిజం పాలసీపై సమీక్షించారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా పాలసీ ఉండాలన్నారు. ప్రధానంగా టెంపుల్, ఎకో టూరిజంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) కు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బుధవారం సమగ్ర కుల గణనపై సమీక్షించిన ఆయన పలు కీలక అంశాలను పేర్కొన్నారు.
కుల గణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కుల గణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పారు.
“రాష్ట్రంలో గత ఏడాది నవంబర్ 6 వ తేదీన ఈ సర్వే ప్రారంభం కాగా, అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారం నాటికి సర్వే పూర్తయింది. రాష్ట్రంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వేకు గుర్తించగా, ఎన్యుమరేటర్లను ఇంటింటికీ పంపించి వివరాలను సేకరించింది. దాదాపు 96 శాతానికి పైగా కుటుంబాల వివరాలను సర్వే బృందాలు విజయవంతంగా సేకరించాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశాయి” అని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో ఆరుగురు మంత్రులతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి ఫిబ్రవరి 2 వ తేదీలోగా నివేదిక అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటేడ్ కమిషన్కు ఈ గణాంకాలు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు.
సంబంధిత కథనం