ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సారపాక గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో రేవంత్ భోజనం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలతో లబ్ధిదారు ఇంట్లో భోజనం చేశారు.
సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో సహపంక్తి భోజనం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను అడిగారు. దొడ్డు బియ్యం పంపిణీ చేసినపుడు అసలు తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదని తులసమ్మ సీఎంకు చెప్పారు. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు.
200 యూనిట్స్ ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలు అందుతున్నాయా అని సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అన్నీ అందుతున్నాయని చెప్పిన తులసమ్మ.. ఉచిత బస్సు ప్రయాణం తమకు ఎంతో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేసింది. అంతకు ముందు భద్రాచలం శ్రీ సీతారాముల వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. ఆ తర్వాత భోజనం చేసి.. భద్రాచలం నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరారు.
భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ సుముహూర్తమున శ్రీ స్వామివారి కళ్యాణం నిర్వహించారు. సీతారాముల కళ్యాణ వేడుకలో సీఎం రేవంత్ దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కల్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి.