నా పేరు తీయడానికి కూడా కేసీఆర్ కు భయం, తెలంగాణ ఇచ్చినందుకా కాంగ్రెస్ విలన్- సీఎం రేవంత్ రెడ్డి-cm revanth reddy fires on ex cm kcr brs silver jubilee meeting question not to come into public ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  నా పేరు తీయడానికి కూడా కేసీఆర్ కు భయం, తెలంగాణ ఇచ్చినందుకా కాంగ్రెస్ విలన్- సీఎం రేవంత్ రెడ్డి

నా పేరు తీయడానికి కూడా కేసీఆర్ కు భయం, తెలంగాణ ఇచ్చినందుకా కాంగ్రెస్ విలన్- సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వం నుంచి జీతభత్యాలతో సహా అన్ని రకాల వసతులు పొందుతూ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తన పేరు తీయడానికి కూడా భయపడ్డారని ఎద్దేవా చేశారు.

నా పేరు తీయడానికి కూడా కేసీఆర్ కు భయం, తెలంగాణ ఇచ్చినందుకా కాంగ్రెస్ విలన్- సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రభుత్వపరంగా సంపూర్ణ మద్దతు ఇచ్చామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. రవీంద్రభారతిలో నిర్వహించిన బసవేశ్వర 892 జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన....పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ...కేసీఆర్ సభపై తొలిసారి స్పందించారు. బీఆర్ఎస్ సభకు వందల బస్సులు ఇవ్వడంతో పాటు వెసులుబాట్లు కల్పించాలని పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు.

ఆదాయం ఉంటేనే పనిచేస్తారా?

"ప్రభుత్వం నుంచి జీతభత్యాలతో సహా అన్ని రకాల వసతులు పొందుతూ ఫామ్ హౌస్ లో ఎందుకు పడుకుంటున్నారో? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి. కేసీఆర్ మా కళ్లల్లోకి చూడటానికి భయమా? అధికారం ఉంటేనే, ఆదాయం ఉంటేనే మీరు పని చేస్తారా? మా కళ్లల్లోకి చూడటానికి భయమేస్తే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదు? నా పేరు తీయడానికి కూడా కేసీఆర్ కు భయం" -సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్లు దోచుకోవడం ఆగిందనా?

తెలంగాణకు కాంగ్రెస్సె ఫస్ట్ విలన్ అంటూ మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపునకు అప్పగించినట్లయిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ మీద పడి దోచుకు తింటున్నారన్నారు. మరో పదేళ్లు దోచుకోవడం ఆగిందని తెలంగాణ ఆగమైందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ విలన్‌ అయ్యిందా? అని మండిపడ్డారు.

కేసీఆర్ కు సవాల్

కాళేశ్వరం, రైతు రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ, కులగణన, రైతుబంధుపై చర్చిద్దామా? కేసీఆర్ అంటూ రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల వద్దకు కేసీఆర్‌ ఎందుకు వెళ్లట్లేదని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ సభకు బస్సులు ఇచ్చామని, సభకు అవసరమైన వెసులు బాటు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం బలంగా ఉండాలనేది కాంగ్రెస్ సిద్ధాంతం అన్నారు. ప్రభుత్వాన్ని భుజం తడుతూ వైఫల్యాలను ప్రశ్నించాలని, వైఫల్యాలపై ఎండగట్టాలన్నారు.

పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో

సభకు రాని ప్రతిపక్ష నేతకి మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు ఉందా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీకి రాను, మా పిల్లల్ని పంపామని చెబుతున్నారన్నారు. పిల్లలను సభకు పంపితే మీరెందుకు ప్రతిపక్ష నేతగా అంటూ ప్రశ్నలు కురిపించారు.

అధికారంలో ఉంటే చెలాయిస్తాం. లేకపోతే ఫామ్ హౌస్‌లో ఉంటామంటున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ పథకాలు నిలిపివేసినట్లు ఆరోపిస్తున్నారని, రైతుబంధు, రైతు రుణమాఫీ, ప్రజా పాలన ఏది ఆగిందని ప్రశ్నించారు. హైదరాబాద్ విస్తరణ కొనసాగుతోందని, పదేళ్ల పాటు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందిని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం