బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రభుత్వపరంగా సంపూర్ణ మద్దతు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రవీంద్రభారతిలో నిర్వహించిన బసవేశ్వర 892 జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన....పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ...కేసీఆర్ సభపై తొలిసారి స్పందించారు. బీఆర్ఎస్ సభకు వందల బస్సులు ఇవ్వడంతో పాటు వెసులుబాట్లు కల్పించాలని పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు.
"ప్రభుత్వం నుంచి జీతభత్యాలతో సహా అన్ని రకాల వసతులు పొందుతూ ఫామ్ హౌస్ లో ఎందుకు పడుకుంటున్నారో? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి. కేసీఆర్ మా కళ్లల్లోకి చూడటానికి భయమా? అధికారం ఉంటేనే, ఆదాయం ఉంటేనే మీరు పని చేస్తారా? మా కళ్లల్లోకి చూడటానికి భయమేస్తే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదు? నా పేరు తీయడానికి కూడా కేసీఆర్ కు భయం" -సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణకు కాంగ్రెస్సె ఫస్ట్ విలన్ అంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపునకు అప్పగించినట్లయిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ మీద పడి దోచుకు తింటున్నారన్నారు. మరో పదేళ్లు దోచుకోవడం ఆగిందని తెలంగాణ ఆగమైందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయ్యిందా? అని మండిపడ్డారు.
కాళేశ్వరం, రైతు రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ, కులగణన, రైతుబంధుపై చర్చిద్దామా? కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల వద్దకు కేసీఆర్ ఎందుకు వెళ్లట్లేదని నిలదీశారు. బీఆర్ఎస్ సభకు బస్సులు ఇచ్చామని, సభకు అవసరమైన వెసులు బాటు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం బలంగా ఉండాలనేది కాంగ్రెస్ సిద్ధాంతం అన్నారు. ప్రభుత్వాన్ని భుజం తడుతూ వైఫల్యాలను ప్రశ్నించాలని, వైఫల్యాలపై ఎండగట్టాలన్నారు.
సభకు రాని ప్రతిపక్ష నేతకి మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు ఉందా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీకి రాను, మా పిల్లల్ని పంపామని చెబుతున్నారన్నారు. పిల్లలను సభకు పంపితే మీరెందుకు ప్రతిపక్ష నేతగా అంటూ ప్రశ్నలు కురిపించారు.
అధికారంలో ఉంటే చెలాయిస్తాం. లేకపోతే ఫామ్ హౌస్లో ఉంటామంటున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ పథకాలు నిలిపివేసినట్లు ఆరోపిస్తున్నారని, రైతుబంధు, రైతు రుణమాఫీ, ప్రజా పాలన ఏది ఆగిందని ప్రశ్నించారు. హైదరాబాద్ విస్తరణ కొనసాగుతోందని, పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందిని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం