కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీల ప్రేవేశపెడతామని, దీనిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైనింగ్ పేరుతో మార్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన మూడేళ్లల్లోనే మేడిగడ్డ కుంగడం, అన్నారం పగలడం జరిగిందని తెలిపారు. ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలు ఉన్నాయని ఆనాడు కేసీఆర్కు నిపుణులు నివేదిక అందించారని, లక్ష కోట్లుపెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోవడంపై.. అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేపడతామని ప్రజలకు ఆనాడు మాట ఇచ్చామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
'ఇచ్చిన మాట ప్రకారం అనుభవం ఉన్న పీసీ ఘోష్ ఛైర్మన్గా జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ నియమించాం. 16 నెలల తరువాత జూలై 31 న 665 పేజీల నివేదికను పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించింది. నివేదిక సారాంశాన్ని తయారు చేసి కేబినెట్ కు అందించాలని ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఊరు మార్చి, పేరు మార్చి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం కూలిపోయింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ లో ఆమోదించాం. రాబోయే రోజుల్లో అసెంబ్లీలో ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలను తీసుకుంటాం.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
కమిషన్ నివేదికను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కమిషన్ రిపోర్టును తప్పుపట్టడం సహజమేనని చెప్పారు. నివేదిక వారికి అనుకూలంగా ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా మాట్లాడటం వారికి అలవాటేనని విమర్శించారు. కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ఇండిపెండెంట్ జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదిక అని, నివేదిక సారాంశం, అందరి సూచనల ప్రకారమే చర్యలు ఉంటాయన్నారు. రాజకీయ కక్ష పూరిత చర్యలకు పాల్పడమని తెలిపారు.