తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా పని చేస్తామని పునరుద్ఘాటించారు.
రైతు భరోసా కింద ఈ నెల 16 వ తేదీన రైతు ఖాతాల్లోకి డబ్బు వేయడం ప్రారంభించినప్పటి నుంచి చెప్పిన మాట ప్రకారం 9 రోజుల్లోగా 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం అన్ని రకాలుగా పోరాడుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు. ఒకవేళ కేంద్రం ప్రాజెక్టుకు అనుమతిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతామన్నారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం తెలిపిన అభ్యంతరాల విషయంలో అసెంబ్లీలో చర్చకు సిద్ధమని వివరించారు.
అధికారం చేపట్టిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాసం ద్వారా యువకులను ఆదుకునే ప్రణాళికలతో ముందుకు వస్తామన్నారు. తదుపరి కార్యక్రమంగా రాజీవ్ యువ వికాసం చేపడుతామని వివరించారు.
సంబంధిత కథనం