తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టుగానే యాదగిరిగుట్ట ఆలయ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని, విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాటిని యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి బోర్డు ద్వారా విశిష్ట సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గంలోని తిరుమలాపురంలో ‘ప్రజాపాలన – ప్రగతిబాట’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంతో పాటు మొత్తంగా 1,051.45 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
రూ. 574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్.
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్.
రూ.183 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం.
రూ.25.50 కోట్లతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని మంచినీరు, డ్రైనేజీ, సీసీ, బీటీ రోడ్లు.
రూ.7.50 కోట్లతో కొలనుపాక గ్రామంలో హైలెవెల్ బ్రిడ్జి.
రూ.6 కోట్లతో కాల్వపల్లి గ్రామంలో హైలెవెల్ బ్రిడ్జి.
రూ.8.25 కోట్లతో మోటకొండూరు మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్.
రూ. 22.75 కోట్లతో దాతర్పల్లి గ్రామంలో 20 వేల మెట్రిక్ సామర్థ్యం గల గోడౌన్లు
రూ. 21.14 కోట్లతో ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ బీటీ రోడ్లు.
రూ.2.75 కోట్లతో ఆలేరు మార్కెట్ కమిటీలో 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు.