CM Revanth Reddy : కరీంనగర్ గడ్డ నుంచే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆనాడు సోనియా గాంధీ మాట ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారన్నారు. పీవీ నరసింహరావు లాంటి ఎంతోమందిని అందించిన ఘనత కరీంనగర్ గడ్డకు ఉందన్నారు. ఈ గడ్డ రాజకీయ చైతన్యానికి మారుపేరు అన్నారు.
"కరీంనగర్ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత జీవన్ రెడ్డిది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని బీఆరెస్ నేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పిలుపునిస్తున్నారు. ఎవరైనా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇతర పార్టీ అభ్యర్థులను ఓడించాలని ప్రచారం చేస్తారు. కానీ ఏ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్ ను ఓడించాలని కేసీఆర్, హరీష్, కేటీఆర్ చెబుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అని మేం ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ ను ఈ వేదికగా సూటిగా ప్రశ్నిస్తున్నా…మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు ఓట్లు ఎవరికి వేయాలని మీరు ప్రచారం చేస్తున్నారు" - సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ ను ఓడించాలని ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు దిల్లీలో సాగిలపడుతున్నారన్నారు. ఉపఎన్నికలు వస్తే గెలుస్తామని బీరాలు పలుకుతున్నవాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. 35 వేల మంది టీచర్ల బదిలీలు, 22 వేల మంది టీచర్ల ప్రమోషన్లు ఏడాదిలో చేసింది నిజమైతే కాంగ్రెస్ కు ఓటు వేయాలన్నారు. టెట్ నిర్వహించి 11 వేల మంది నియామకపత్రాలు ఇచ్చింది నిజమైతే కాంగ్రెస్ కు ఓటు వేయాలన్నారు.
గతంలో జీతాల కోసం ఎదురుచూసిన పరిస్థితి కల్పించింది కేసీఆర్ కాదా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసింది నిజమైతే కాంగ్రెస్ కు ఓటు వేయాలన్నారు. ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. క్రీడల్లో రాణించిన వారిని ప్రోత్సహించేందుకు వారికి ఉద్యోగం ఇచ్చింది వాస్తవం అన్నారు. పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం, నగదు ప్రోత్సాహం అందించింది నిజమన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశంలోనే మొదటిసారిగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు.
"బీఆర్ఎస్ కు అసూయ, ద్వేషం, కోపం, అక్కసు ఉండటం సహజం. ఎందుకంటే వాళ్లు కూర్చోవాల్సిన కుర్చీల్లో మేం కూర్చున్నాం. బీఆరెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు దిల్లీకి పోయేది లేదన్నారు. అధికారంలో పోయాక చీకట్లో కాళ్లు పట్టుకుని వెలుగులో ముచ్చట్లు చెబుతుండ్రు. తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ది. వరి వేసుకుంటే ఊరే అని చెప్పిన చరిత్ర వాళ్లది.. కానీ వరికి బోనస్ అందిస్తున్న ఘనత మాది. కాళేశ్వరం కూలిపోయినా పంటలకు నీళ్లు ఇచ్చి.. గిట్టుబాటు ధర ఇచ్చి వడ్లు కొనుగోలు చేశాం. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేం ఓట్లు అడగం అని మోదీకి సవాల్ విసురుతున్నాను" - సీఎం రేవంత్ రెడ్డి
"రెండుసార్లు బండి సంజయ్ ను గెలిపిస్తే ఏం తీసుకొచ్చిండు. పెద్ద బీసీ మోదీ, చిన్నబీసీ సంజయ్ కలిసి కనీసం బీసీల లెక్కలు కూడా తేల్చలేదు. బలహీన వర్గాల లెక్కలు తీసిన ఘనత మాది… అందుకు కాంగ్రెస్ ను ఓడించాలని చెబుతున్నారా? జనగణనలో కులగణన చేర్చాలని మేం డిమాండ్ చేస్తున్నాం. సంజయ్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నా… మీ అధికారులను అడుగు బీసీలలో ముస్లింలను చేర్చింది ఎవరో. గుజరాత్ లో 39 ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నది నిజం కాదా? బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నది నిజం కాదా? బీజేపీకి ఎనిమిది ఎంపీలను ఇచ్చినా తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదు. బీజేపీని బొందపెడితేనే తెలంగాణకు నిధులు వస్తాయ్." - సీఎం రేవంత్ రెడ్డి
సంబంధిత కథనం