Telangana Tourism Policy : ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ - కొత్త టూరిజం పాలసీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Telangana State Tourism Policy :ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసే విషయంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. విమానాశ్రయం నుంచి 20 నిమిషాల్లో చేరుకునేలా కన్వెన్షన్ సెంటర్ ఉండాలన్నారు. డిసెంబర్ 31లోపు కొత్త పర్యాటక విధానం తయారు చేయాలని స్పష్టం చేశారు.
డిసెంబర్ 31 వ తేదీలోగా తెలంగాణ కొత్త పర్యాటక విధానం తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి దుబాయ్, సింగపూర్, చైనా వంటి దేశాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.
పర్యాటక విధానం రూపొందించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి… ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. పర్యాటక రంగం అభివృద్ధికి రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ గత పదేళ్లలో ప్రత్యేకమైన పాలసీ లేకపోవడం వల్ల నష్టపోయాం. హైదరాబాద్ వాతావరణం 365 రోజులు బాగుంటుంది కాబట్టి అత్యుత్తమైన పాలసీని తయారు చేయాలని చెప్పారు.
కాన్సెప్ట్ టూరిజంపై దృష్టి పెట్టండి - సీఎం రేవంత్
పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశం, ఆస్కారం ఉన్న ప్రాంతాల గురించి సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పర్యాటక అభివృద్ధి సంస్థ రూపొందించిన పర్యాటక ప్రాంతాలపై రూపొందించిన షార్ట్ ఫిలిమ్ ను ఆవిష్కరించారు.
టైగర్ రిజర్వు ఫారెస్ట్ లను దేవాలయాలతో కనెక్ట్ చేయడం, రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాల్లో పర్యాటకులు పెరిగేలా చూడాలన్నారు. ఉచిత బస్సు సౌకర్యం వల్ల టెంపుల్ టూరిజం గణనీయంగా పెరిగిందని, రొటీన్ టూరిజం కాకుండా కాన్సెప్ట్ టూరిజంపై దృష్టి సారించడం వంటి పలు అంశాలను సీఎం సూచించారు.
పర్యాటకులను ఆకర్షించడానికి ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేయాలి. విమానాశ్రయం నుంచి 20 నిమిషాల్లో చేరుకునేలా కన్వెన్షన్ సెంటర్ ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో పర్యాటక శాఖ స్థలాల లీజులపైన ఆరా తీసిన ముఖ్యమంత్రి… వాటిపై సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు. లీజు ముగిసినా ఖాళీ చేయని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కోర్టు కేసులను సీరియస్ తీసుకుని స్టేలు ఎత్తివేసేలా చూడాలన్నారు. ఇకనుంచి మంచి గుర్తింపు ఉన్న కంపెనీలకు మాత్రమే పర్యాటక స్థలాలను లీజుకు ఇవ్వాలని పేర్కొన్నారు.
ఖాళీ చేయబోయే ఉస్మానియా ఆసుపత్రి హెరిటేజ్ భవనాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి సూచించారు. చార్మినార్ కు పర్యాటకులు పెరిగేలా అక్కడ పరిస్థితులు కల్పించాలన్నారు. సొంత కాళ్లపై నిలబడేలా టూరిజం శాఖ కసరత్తు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లితో పాటు టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్, అధికారులు పాల్గొన్నారు.
సంబంధిత కథనం