'రాష్ట్రాభివృద్ధికి సహకరించండి'... ప్రధాని మోదీతో సీఎం రేవంత్, ప్రస్తావించిన అంశాలివే-cm revanth meet pm modi in delhi to discuss critical development initiatives in the state and seek the centre support ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  'రాష్ట్రాభివృద్ధికి సహకరించండి'... ప్రధాని మోదీతో సీఎం రేవంత్, ప్రస్తావించిన అంశాలివే

'రాష్ట్రాభివృద్ధికి సహకరించండి'... ప్రధాని మోదీతో సీఎం రేవంత్, ప్రస్తావించిన అంశాలివే

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు. పలు కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సాకారం అందించాలని కోరారు. మెట్రో సెకండ్ ఫేజ్, రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు పలు ముఖ్యమైన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

ప్రధానమంత్రి మోదీతో సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం జరిగిన ఈ సమావేశంలో.... రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రధాన అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ప్రస్తావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... వాటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించిన అంశాలు:

  • హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కోరారు. 76 కి.మీ పొడవుతో ఐదు కారిడార్ల ఫేజ్-II ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి పంపామని గుర్తు చేశారు.
  • రూ. 24,269 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ జాయింట్ వెంచర్ (జెవీ) ప్రాజెక్టులో కేంద్ర వాటా 18 శాతం కాగా, రాష్ట్ర వాటా 30 శాతం. ఇటీవలి కాలంలో చెన్నై, బెంగళూరుకు ఆమోదించిన మెట్రో ప్రాజెక్టుల ఆధారంగా హైదరాబాద్ ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇవ్వాలన్నారు.
  • హైదరాబాద్ మహానగరం చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు (RRR)ను సమగ్రంగా అభివృద్ధి చేయాలని, ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా ఒకేసారి ప్రారంభించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.
  • ఇప్పటికే భూ సేకరణలో పురోగతి ఉన్న ఉత్తర భాగం పూర్తయ్యేలోపు దక్షిణ భాగాన్ని చేపట్టకపోతే వ్యయం పెరిగే ప్రమాదం ఉందని వివరించారు. భూసేకరణ వ్యయంలో 50 శాతం భారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
  • రీజినల్ రింగ్ రోడ్డు (RRR)కు సమాంతరంగా 370 కి.మీ పరిధిలో రీజినల్ రింగ్ రైల్వే లైన్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి కూడా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశారు.
  • తెలంగాణలోని డ్రైపోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కోరారు. ఔషధ ఎగుమతులు, తయారీ రంగ అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
  • ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)కు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తోందని ప్రధానమంత్రికి తెలిపారు. సెమీకండక్టర్ పరిశ్రమలో తెలంగాణ కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ ప్రతిపాదించిన ISM ప్రాజెక్టుకు ఆమోదం తెలిస్తే.... పెట్టుబడులు, ఉద్యోగాలు పెరుగుతాయన్నారు.
  • హైదరాబాద్ మొదటి నుంచి రక్షణ రంగంలో కీలకంగా ఉంటోన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ రంగంలో MSMEలకు ప్రోత్సాహం అవసరమన్నారు. హైదరాబాద్ – బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణకు సమానంగా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేశారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.