తెరపైకి 9 - 12 తరగతుల విధానం..! సమగ్ర అధ్యయనానికి ఆదేశాలు-cm revanth instruct officials to study on policy for class 9 and 12 education system ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెరపైకి 9 - 12 తరగతుల విధానం..! సమగ్ర అధ్యయనానికి ఆదేశాలు

తెరపైకి 9 - 12 తరగతుల విధానం..! సమగ్ర అధ్యయనానికి ఆదేశాలు

ఇంటర్మీడియట్ లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గటంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. త‌గ్గిపోవ‌డానికి గ‌ల కారణాలను అధ్యయనం చేసి వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని అధికారులను ఆదేశించారు. తాజాగా విద్యాశాఖపై సమీక్షించిన సీఎం… 9 -12 తరగతుల విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

ప‌దవ త‌ర‌గతిలో ఉత్తీర్ణులైన ప్ర‌తి విద్యార్థి త‌ప్ప‌నిస‌రిగా ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. 10వ త‌ర‌గ‌తిలో పెద్ద సంఖ్య‌లో ఉత్తీర్ణ‌త క‌నిపిస్తున్నప్పటికీ… ఇంట‌ర్మీడియ‌ట్ పూర్త‌య్యే స‌రికి ఆ సంఖ్య గ‌ణ‌నీయంగా ఎందుకు తగ్గుతోందని ఆరా తీశారు. త‌గ్గిపోవ‌డానికి గ‌ల కారణాలను అధ్యయనం చేసి వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని సూచించారు.

ఆ విధానంపై అధ్యయనం చేయండి - సీఎం రేవంత్

బుధవారం రోజు విద్యాశాఖ‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఇంట‌ర్మీడియ‌ట్ ద‌శ కీల‌క‌మైనందని…. ఆ ద‌శ‌లో విద్యార్థికి స‌రైన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం అందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. ఇత‌ర రాష్ట్రాల్లో 9 వ త‌ర‌గ‌తి నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు(సీనియర్‌ సెకండరీ స్కూల్స్‌) అమలు చేస్తున్నారని…. అందువల్ల అక్క‌డ డ్రాపౌట్స్ సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని అధికారులు వివరించారు.

అలాంటి రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విష‌యంలో విద్యా క‌మిష‌న్, ఆ విభాగంలో ప‌ని చేసే ఎన్జీవోలు, పౌర స‌మాజం సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని సూచించారు. ఇంట‌ర్మీడియ‌ట్ విద్యను పటిష్టపరచడానికి శాస‌న‌స‌భ‌లోనూ చ‌ర్చ‌కు పెడ‌తామ‌ని…. ఇంటర్‌లో విద్యార్థుల చేరిక‌తో పాటు వారి హాజ‌రుపైనా దృష్టిపెట్టాల‌న్నారు.

ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూళ్లు - సీఎం రేవంత్

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల న‌మూనాల‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ ప‌రిశీలించారు. ప్ర‌తి పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాల‌ని సూచించారు. పాఠ‌శాల‌ల నిర్మాణం ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని, నిర్మాణాల ప్ర‌గ‌తిపై ప్ర‌తి వారం త‌న‌కు నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో బాలుర‌కు ఒక‌టి, బాలిక‌ల‌కు ఒక‌టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల నిర్మాణాల‌ను చేప‌డ‌తామ‌న్నారు. ఇప్ప‌టికే ఒక్కో పాఠ‌శాల‌కు సంబంధించి స్థ‌ల సేక‌ర‌ణ పూర్త‌యినందున‌, రెండవ పాఠ‌శాల‌కు సంబంధించిన స్థ‌ల గుర్తింపు, సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌పై దృష్టి సారించాల‌ని ఆదేశించారు.

వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా విశ్వవిద్యాల‌యం నిర్మాణ న‌మూనాను పరిశీలించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌లు మార్పుల‌ను సూచించారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.