హైదరాబాద్‌లో సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్.. ప్రారంభించిన సీఎం రేవంత్-cm revanth inaugurates sonata software new facility center in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్‌లో సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్.. ప్రారంభించిన సీఎం రేవంత్

హైదరాబాద్‌లో సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్.. ప్రారంభించిన సీఎం రేవంత్

హైదరాబాద్‌లో సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించుకున్న సందర్భంగా.. ఉద్యోగులు, యాజమాన్యానికి శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

సొనాటా సాఫ్ట్‌వేర్ అత్యాధునిక ఏఐని ఉపయోగించి.. పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణం.. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మహానగరం సాఫ్ట్‌వేర్ రంగంలో, లైఫ్ సైన్సెస్‌ రంగంలో.. ఇంకా అనేక రంగాల్లో జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)కు హబ్‌గా మారిందని వివరించారు. అలాగే ఏఐ-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారిందని చెప్పారు.

సంక్షేమం.. అభివృద్ధి..

'మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు తమ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయి. తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే.. పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు.. రాష్ట్రానికి కొత్తగా రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించాం' అని రేవంత్ రెడ్డి వివరించారు.

తెలంగాణ నంబర్ వన్..

'2025లో దావోస్‌లో తెలంగాణ రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి నంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రం పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణ నిర్వహణ, ఉద్యోగ సృష్టి, పన్ను వసూళ్లలో నంబర్ వన్‌గా ఉంది. 66 లక్షల మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారత, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత వ్యాపారాలు, స్వయం ఉపాధికి అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తోంది' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

మొదటి రాష్టంగా తెలంగాణ..

'హైదరాబాద్ ట్రాఫిక్ ఫోర్స్‌లో ట్రాన్స్‌జెండర్ స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. డ్రై పోర్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ సముద్ర ఓడరేవుతో అనుసంధానం, ఫ్యూచర్ సిటీలో ఏఐ నగరం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోంది' అని సీఎం వివరించారు.

బ్రాండ్ అంబాసడర్లుగా మారండి..

'ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటిగా పేరుపొందిన మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఇంకా మరిన్ని ప్రపంచ ఈవెంట్‌లను తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతోంది. ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్‌ను అత్యద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నాం. హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసడర్లుగా మారండి. మన విజయాలను ప్రపంచానికి చూపండి' అని రేవంత్ పిలుపునిచ్చారు.

సంబంధిత కథనం