ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నెలకొంది. లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం నియమించిన ఇందిరమ్మ కమిటీల్లో తమ వర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు పట్టుబడుతున్నారు. దీంతో పార్టీలోని పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం తలెత్తుతోంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి నేతలు చేరిన చోట ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న చోట ఇబ్బంది కొంత లేకపోయినా, ఎమ్మెల్యే లేని చోట, లేదా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే ఉన్న చోట సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ఇందిరమ్మ కమిటీలు కీలకంగా వ్యవహరించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ వారిని ఈ కమిటీల్లో నియమించడం వల్ల ఇండ్ల కేటాయింపులో అర్హులకు న్యాయం జరగదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికార పార్టీ వారికి మేలు చేసేందుకే ఇందిరమ్మ కమిటీలు పని చేస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలని, అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇటు స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వర్గపోరు సమస్యగా మారింది. ఇటీవల వరంగల్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు. ఓ మున్సిపాలిటీకి చెందిన నాయకులు సమావేశం నిర్వహించారు. అక్కడ ఒక్కో వార్డుకు 15 ఇండ్లు మంజూరు అవ్వగా.. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో మొదట తమవారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయా వార్డుల నాయకులు పట్టుబట్టారు. ఈ క్రమంలో గొడవ జరిగింది.
ఈ విషయం కాస్త ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లింది. తమ వారికే ఇండ్లు ఇవ్వాలని ఇలా బహిరంగంగా వాదులాడుకోవడం ఏంటని నేతలు మందలించినట్టు తెలిసింది. ఏదైనా విషయంపై చర్చించాలనుకుంటే.. సామరస్యంగా మాట్లాడుకోవాలని సూచించినట్టు సమాచారం. అటు గ్రామాల్లోనూ నాయకుల ఇండ్ల చుట్టూ అర్హులు తిరుగుతున్నారు. తమకు ఇల్లు వచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు.
సంబంధిత కథనం