కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నేత ఫైర్.. మంత్రుల ప్రోగ్రామ్‌లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం-clashes between brs and congress mlas at ministers program in warangal district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నేత ఫైర్.. మంత్రుల ప్రోగ్రామ్‌లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నేత ఫైర్.. మంత్రుల ప్రోగ్రామ్‌లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం

HT Telugu Desk HT Telugu

మంత్రులు ఉత్తమ్, పొంగులేటి దేవాదుల ప్రాజెక్టులోని దేవన్నపేట పంప్ హౌజ్ ను సందర్శించారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆన్ గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వరద నివారణ పనులు, ధాన్యం కొనుగోళ్లు, భద్రకాళి చెరువు సుందరీకరణపై సమీక్ష నిర్వహించేందుకు.. సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం హనుమకొండ జిల్లాకు వచ్చారు.

పనులపై రివ్యూ..

మంత్రులు హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్ లో నేరుగా దేవాదుల ప్రాజెక్టులో భాగంగా హసన్‌పర్తి మండలం దేవన్నపేట వద్ద నిర్మించిన పంప్ హౌజ్ ను పరిశీలించేందుకు వెళ్లారు. వారికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవన్నపేట ప్రాజెక్టు 3 పంప్ హౌజ్ వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ ఆఫీసర్లతో దేవాదుల ప్రాజెక్టు పనులపై రివ్యూ చేశారు.

నాయిని అభ్యంతరం..

ఇంటర్నల్ గా జరిగిన ఈ రివ్యూకు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లను తప్ప ఎవరినీ అనుమతించలేదు. ఇదిలాఉంటే రివ్యూ జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్యేలు, ఇతర నేతల పీఏలంతా సైలెంట్ గా ఉండగా.. జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి పీఏ ఇంటర్నల్ రివ్యూను వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. పక్కనే ఉన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.. వీడియోలు, ఫొటోలు ఎందుకు తీస్తున్నావంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కాస్త పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వివాదానికి దారి తీసింది.

ఇద్దరు ఎమ్మెల్యేల వాగ్వాదం..

రివ్యూ అనంతరం బయటకు వస్తున్న క్రమంలో.. ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఫొటోలు, వీడియోలు తీస్తుంటే అభ్యంతరం చెప్పడం ఎందుకని ఎమ్మెల్యే పల్లా ప్రశ్నించారు. ‘అదేమైనా దొంగ పనా.. లంగ పనా..?’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.

టెన్షన్ వాతావరణం..

కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని కూడా ధీటుగానే స్పందించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వాదం చోటుచేసుకోగా.. పక్కనే ఉన్న మిగతా నేతలంతా సైలెంట్ గా వారి వెనకాలే మెట్లు దిగి బయటకు వచ్చేశారు. ఇద్దరు వ్యతిరేక పార్టీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం అక్కడికక్కడ టెన్షన్ వాతావరణం పుట్టించగా.. ఏం జరుగుతుందోననే కంగారు మిగతా నేతల్లో కనిపించింది. వాగ్వాదం అనంతరం ఎమ్మెల్యేలు ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్లిపోగా.. వారి మాటల యుద్ధానికి అంతటితో ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం